AAP MP Sanjay singh | న్యూఢిల్లీ, మే 3: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అతిగా స్పందిస్తున్నదన్న వాదనను ఆ సంస్థే నిజం చేసి చూపించింది. వీలైనంత ఎక్కువమంది ప్రతిపక్ష నేతలను ఈ కేసులో ఇరికించాలన్న తాపత్రయంతో కేసుతో ఏ సంబంధమూ లేని వ్యక్తుల పేర్లును కూడా చార్జిషీట్లో చేరుస్తున్నది. తాజాగా ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ పేరును చార్జిషీట్లో చేర్చటం ద్వారా ఎంతటి రాజకీయ ఒత్తిడిమధ్య పనిచేస్తున్నారో ఈడీ అధికారులు బయటపెట్టుకొన్నారు. చివరకు క్షమాపణ చెప్పి తప్పించుకోజూశారు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేసులో నిందితుల పేర్లను కూడా సరిచూసుకోకుండా ఈడీ అత్యంత కీలకమైన చార్జిషీట్ను కోర్టుకు సమర్పించింది. దీన్నిబట్టే ఈ కేసులో ఈడీ పనితీరు ఎలా ఉన్నదో అర్థంచేసుకోవచ్చని ఆప్ నేతలు మండిపడుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలు జరిగాయని దర్యాప్తు జరుపుతున్న ఈడీ, రాహుల్సింగ్ అనే వ్యక్తి పేరుకు బదులుగా ఆప్ ఎంపీ సంజయ్సింగ్ పేరును చేర్చింది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిఫ్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఈడీ జైలుకు పంపింది. ఆ తర్వాత కోర్టులో సమర్పించిన చార్జిషీట్లో ఎంపీ సంజయ్సింగ్ పేరును కూడా చేర్చింది. చార్జిషీట్లో సంజయ్సింగ్ పేరును నాలుగు చోట్ల ప్రస్తావించారు. దినేశ్ అరోరా అనే వ్యక్తి 2022 అక్టోబర్ 1న ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే సంజయ్సింగ్ పేరును చార్జిషీట్లో చేర్చినట్టు స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో దేశవ్యాప్తంగా మీడియాలో ఆయన పేరు మారుమోగిపోయింది.
సంజయ్సింగ్ భారీ అక్రమాలకు పాల్పడ్డారని ఒకవర్గం మీడియా ఆధార రహిత కథనాలు అల్లి జనంలోకి వదిలింది. దీంతో తన పేరును అక్రమంగా చార్జిషీట్లో చేర్చినందుకు క్షమాపణ చెప్పాలని ఈడీ డైరెక్టర్ సంజయ్కుమార్ మిశ్రా, డిఫ్యూటీ డైరెక్టర్ జోగేంద్రను సంజయ్సింగ్ డిమాండ్ చేశారు. కానీ, వాళ్లు స్పందించకపోవటంతో ఆప్ నేత లీగల్ నోటీసు పంపారు. ఈడీ డైరెక్టర్, డిఫ్యూటీ డైరెక్టర్పై క్రిమినల్ చర్యలు చేపట్టేందుకు అనుమతి కోరుతూ కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శికి నోటీసు కూడా ఇచ్చారు. ఇక తప్పించుకోలేమని అర్థమవటంతో ఎట్టకేలకు ఈడీ క్షమాపణ చెప్తూ సంజయ్సింగ్కు ఓ లేఖ రాసింది. క్లరికల్ తప్పిదం వల్ల రాహుల్సింగ్కు బదులుగా సంజయ్ సింగ్ పేరును చేర్చామంటూ లేఖలో పేర్కొన్నది.
దేశంలోనే ఎంతో నిజాయితీగల పార్టీగా పేరుగాంచిన ఆమ్ ఆద్మీ పరువు, ప్రతిష్ఠలు దెబ్బ తీయడానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పేరును పొరపాటున చేర్చామని పేర్కొంటూ ఈడీ ఆయనకు క్షమాపణ చెప్పడాన్ని ప్రస్తావిస్తూ ‘ఏ దర్యాప్తు సంస్థ అయినా పొరపాటున ఒకరి పేరును చార్జిషీట్లో చేరుస్తుందా? ఇదంతా చూస్తే ఈ కేసే ఒక బూటకమని స్పష్టమవుతున్నది. నీతి, నిజాయితీకి మారుపేరుగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో రోజురోజుకూ ఎదగడాన్ని చూసి తట్టుకోలేక దాని ప్రతిష్ఠ దిగజార్చడానికే ప్రధాని ఇలాంటి కుళ్లు రాజకీయాలకు పాల్పడుతున్నారు. వారికి ఇది ఎంతమాత్రం తగదు’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ఈ కేసులో సంజయ్ సింగ్ పేరును చార్జిషీట్లో ఉద్దేశపూర్వకంగానే చేర్చారని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. ‘సంజయ్ సింగ్ పేరు పొరపాటున చార్జిషీట్లో నమోదు చేసినట్టు వారు ప్రకటించారు. ఇదెలా జరిగింది? ఒక బీజేపీ ఎంపీ పేరును అలా పొరపాటున చేర్చగలరా? ఇదంతా ప్రధాని కార్యాలయం ప్రోద్బలంతోనే జరిగింది. ఇది కేవలం కేంద్రం కుట్ర మాత్రమే’ అని భరద్వాజ్ ఆరోపించారు. వారు తొలిసారిగా తాము చేసిన తప్పుకు సంజయ్ సింగ్కు క్షమాపణ చెప్పారని, అదే విధంగా కేంద్రం కూడా సంజయ్ సింగ్కు, ఆప్కు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
చార్జిషీట్లో సంజయ్ సింగ్ పేరును ఉద్దేశపూర్వకంగానే ఈడీ చేర్చిందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు లిక్కర్ కేసే ఒక అబద్ధమని, దాన్ని నిజం అని చెప్పేందుకు కేంద్రం డైరెక్షన్లో ఈడీ చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నదని మండిపడుతున్నారు. ఈడీ క్షమాపణలు చెప్పటమే అందుకు ఉదాహరణ అని పేర్కొంటున్నారు. ఈ కేసు దర్యాప్తుపై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.