హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ప్రతిపక్షాల నిరసనల నడుమే పార్లమెంట్ ఉభయ సభలు పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపాయి. సభ ఆర్డర్లో లేకున్నా కీలక బిల్లులపై ఎలాంటి చర్చ లేకుండా మూజువాణి ఓటుతో బిల్లులకు ఆమోదం వేశారు. లోక్సభ ప్రారంభం కాగానే భారత రాష్ట్ర సమితి సభ్యులతో సహా విపక్ష సభ్యులు అదానీ అంశంపై జేపీసీ ఏర్పాటు చేయాలని పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అనంతరం 12 గంటలకు ప్రారంభమైన తర్వాత కూడా బీఆర్ఎస్ సహా ప్రతిపక్షాల ఎంపీలు నిరసన తెలిపారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా మూజువాణి ఓటుతో బిల్లులను ఆమోదించినట్లుగా ప్రకటించారు.
సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి అదానీ అంశంపై జేపీసీ వేయాలని బీఆర్, ఇతర విపక్షాలు వాయిదా తీర్మానాలు ఇచ్చినా, వెల్లోకి వెళ్లి నిరసన తెలిపినా, గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేసినా కనీస స్థాయిలో కూడా అధికార బీజేపీ ప్రభుత్వం స్పందించలేదు. కనీసం చర్చలకు కూడా పిలవకుండానే వాయిదాలు వేసుకుంటూ కాలం వెళ్లదీశారు. గతంలో ఎన్నడూ ఈ విధంగా సభ జరగలేదని బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు అన్నారు. బీజేపీ ప్రభుత్వం కనీసం ప్రతిపక్షాలతో వారి డిమాండ్లపై మాట మాత్రం కూడా మాట్లాడటానికి ముందుకు రాకపోవడం ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థకు మంచిది కాదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర పాలకులు ప్రజా కోణంలో వ్యవహరించకుండా నియంతల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం సరికాదని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర రావు అన్నారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ సహా అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని ఆయన అన్నారు. అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లుగా చేయడం సరికాదని, రాబోయే రోజుల్లో ప్రజలు బీజేపీ తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పులను పక్కకు పెట్టి నిస్సిగ్గుగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదన్నారు.