Nalini Sriharan | దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులు శనివారం జైలు నుంచి విడుదలయ్యారు. ఇందులో ఒకరైన నళిని శ్రీహరన్ ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా నళిని భావోద్వేగానికి గురైంది. రాజీవ్ కుమార్తె, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆదివారం తనను జైలులో కలిశారని, రాజీవ్ హత్యపై ప్రియాంక పలు ప్రశ్నలు సంధించిందని నళిని తెలిపింది. ఈ సందర్భంలో ప్రియాంక భావోద్వేగానికి గురైందని, ఆ సమయంలో తాను సైతం ఏడ్చినట్లు చెప్పింది. తన భర్తను తిరుచ్చి ప్రత్యేక శిబిరం నుంచి విడుదల చేయాలని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.
తిరుచ్చి ప్రత్యేక శిబిరంలో తన భర్తను కలువబోతున్నట్లు తెలిపిన నలిళి.. తనకు ఓ కూతురు ఉందని తెలిపింది. కూతురు తన తండ్రిని కలుసుకునేందుకు ఉత్సాహంగా ఉందని చెప్పింది. ప్రస్తుతం తాను సంతోషంగా లేనని పేర్కొన్న నళిని, తర్వాత తాను తమిళనాడులోని కొన్ని ప్రాంతాలను సందర్శించాలని అనుకుంటున్నానని.. ఇందులో కమలా సర్ మెమోరియల్ ఒకటి అని చెప్పింది. అలాగే కేసు నుంచి బయటపడేందుకు సహకరించిన వారందరినీ కలవాలని అనుకుంటున్నట్లు తెలిపింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ను కలిసి కృతజ్ఞతలు తెలుపనున్నట్లు పేర్కొంది. గాంధీ కుటుంబానికి చాలా కృతజ్ఞురాలునని, వారిని కలిసేందుకు అవకాశం వస్తే.. తప్పకుండా కలుస్తానంది.
ఈ సందర్భంగా జైలులో ఉన్న రోజులను గుర్తు చేసుకున్న నళిని.. గర్భవతిగా ఉన్న సమయంలోనే తనను జైలులో నిర్బంధించారని.. తనను ఉరిశిక్ష ఖైదిలను చూసిన మాదిరిగానే చూశారని చెప్పింది. ప్రస్తుతం కుటుంబానికే ప్రాధాన్యమని, వృత్తిపరంగా ఏమీ చేయలేనని చెప్పింది. ఇప్పటికే తన జీవితమంతా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేసిన నళిని.. ఇకపై కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాది ఆనంద్ సెల్వన్ మాట్లాడుతూ.. నళిని 30 ఏళ్లకుపైగా జైల్లో జీవిస్తోందని, ఆమెకు సాయం చేయాలని కోరారు. నళిని కోసం 20 సంవత్సరాలు పని చేశామని, సత్ప్రవర్తన కారణంగా తమిళనాడు ప్రభుత్వం రాజీవ్ హత్య కేసులో దోషులను విడుదల చేసేందుకు అంగీకరించిందని పేర్కొన్నారు.