న్యూఢిల్లీ: కేరళలోని తన లోక్సభ నియోజకవర్గం వాయనాడ్లో రాహుల్గాంధీ పర్యటనపై బీజేపీ జాతీయాధ్యక్షుడు ( BJP president ) జేపీ నడ్డా విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్గాంధీది రాజకీయ పర్యటన అని ఎద్దేవా చేశారు. కోజికోడ్లో కొత్తగా నిర్మించిన బీజేపీ జిల్లా కార్యాలయ బిల్డింగ్ను నడ్డా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాహుల్ పర్యటనపై విమర్శలు గుప్పించారు.
‘కేరళలో రాహుల్గాంధీ రాజకీయ పర్యటన కొనసాగుతున్నది. ఆయన అమేథీలో ఓడిపోయి, వాయనాడ్కు పారిపోయాడు. రాష్ట్రాలు మార్చినంత మాత్రాన ఒక వ్యక్తి ప్రవర్తన, ఉద్దేశాలు, అంకితభావం మారవు’ అని నడ్డా ఎద్దేవా చేశారు. కేరళ గురించి మాట్లాడేటప్పుడు తనలో తీవ్ర వేదన, బాధ కలుగుతాయని ఆయన వ్యాఖ్యానించారు. గత మూడు నాలుగు దశాబ్దాలు కేరళలో ఉన్న రాజకీయ సంస్కృతి వల్ల అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. ఇప్పటికీ కేరళ అభివృద్ధికి నోచుకోవడం లేదని చెప్పారు.