Lucknow : ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడులను, ఖమేనీ మృతిని నిరసిస్తూ నిరసనలకు పిలుపునిచ్చాయి ఇండియాలోని పలు ముస్లిం సంఘాలు. ఈ మేరకు అన్ని ముస్లిం సంఘాలు ఖమేనీ మృతికి సంతాపం తెలపాలని, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించాలని లక్నోలోని మౌలానా జవ్వాద్ పిలుపునిచ్చాడు.
మరోవైపు ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్బీ) జనరల్ సెక్రెటరీ మౌలానా యాసూబ్ అబ్బాస్ కూడా దీనిపై స్పందించాడు. ఆదివారం సాయంత్రం లక్నోలోని చోటా ఇమాంబారా దగ్గర భారీ నిరసనలు, సంతాప సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించాడు. అంతేకాదు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దిష్టిబొమ్మలు దహనం చేస్తామని కూడా ప్రకటించాడు. ఖమేనీ మృతికి నిరసనగా దేశంలోని షియా వర్గం ముస్లింలు మూడు రోజులు సంతాపం ప్రకటించాడు. ఈ సందర్భంగా అందరూ నల్ల రంగు బ్యాడ్జీలు, దుస్తులు ధరించాలని, ఇంటిపై నల్ల రంగు జెండాలు ఎగరేయాలని, ప్రత్యేక ప్రార్థనలు జరపాలని కూడా అబ్బాస్ పిలుపునిచ్చాడు. ఏఐఎంపీఎల్బీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, లక్నో షహర్ ఖాజీ మౌలానా ఖలిద్ రషీద్ మాట్లాడుతూ ఖమేనీని అంతమొందించడాన్ని ఖండించాడు.
అంతర్జాతీయ సమాజం ఈ దాడిని ఖండించాలని కోరాడు. సున్నీ ముస్లింలు కూడా మసీదుల్లో ఖమేనీకి ప్రత్యేక ప్రార్థనలు జరపాలని సూచించాడు. మరోవైపు షియాకు చెందిన మౌలానా కల్బే జవ్వాద్ ఖమేనీ హత్యను ఖండించాడు. ఆయనను చంపడం శతాబ్దంలోనే అతిపెద్ద విషాద ఘటనగా అభివర్ణించారు. మరికొందరు ముస్లిం లీడర్లు కూడా ఖమేనీ హత్యను ఖండించారు. ఈ మేరకు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు.