Murder | ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఓ గొడవ అభం శుభం తెలియని 11 ఏళ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. చిన్నారి తండ్రి తనను పదేపదే అవమానిస్తున్నాడని కోపం పెంచుకున్న ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కోపంతో చిన్నారి తలను తెగనరికాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన మాల్దా జిల్లాలో ఉద్రిక్తతలకు దారితీసింది.
వివరాల్లోకి వెళ్తే.. మాల్దా జిల్లాకు చెందిన ఇద్దరు బంధువుల మధ్య ఇటీవల గొడవలు జరిగాయి. వారిలో ఒక వ్యక్తికి పదకొండేళ్ల కుమార్తె ఉంది. ఆ చిన్నారి తండ్రి తనను తరచూ పదిమందిలో అవమానిస్తున్నాడని అవతలి వ్యక్తి బాగా పగ పెంచుకొన్నాడు. పగతో రగిలిపోయిన అతడు శత్రువు 11 ఏళ్ల కుమార్తెను చంపేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఆమె మొండాన్ని, తలను వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు.
ఈ ఘటన జిల్లావ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. హంతకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. సీసీఫుటేజ్ ఆధారంగా చిన్నారిని తన బంధువే చంపాడని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు చెప్పిన సమాచారంతో బాలిక తలను, మొండాన్ని స్వాధీనం చేసుకున్నారు.