Rasagulla murder | ఆగ్రాలో ఓ రసగుల్లా కారణంగా పెండ్లి ఆనందం కాస్తా శోకసంద్రంగా మారింది. పెండ్లి ఊరేగింపుకు వచ్చిన 20 ఏళ్ల యువకుడు కత్తి తగిలి మృతిచెందాడు. దాంతో రెండు వర్గాల మధ్య ఘర్షన తారాస్థాయికి చేరుకున్నది. ఈ ఘర్షణలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన అనంతరం పెండ్లిని వాయిదా వేశారు. పెండ్లికూతురు కుటుంబం మొత్తం పరారీలో ఉన్నది. ఇంతటి ఘర్షణకు కారణంగా రసగుల్లా అని తేలింది.
ఖండౌలీలో నివసిస్తున్న వ్యాపారవేత్త వకార్ ఇద్దరు కుమారులు జావేద్, రషీద్ వివాహం ఎత్మాద్పూర్లో నివసిస్తున్న ఉస్మాన్ కుమార్తెలు జైనాబ్, సజియాలతో జరిపేందుకు నిశ్చయించారు. పెండ్లి ఊరేగింపులో రసగుల్లాలు తినిపించారు. వరుడి తరఫు వారు మరో రసగుల్లా అడగడంతో వాగ్వాదం మొదలై.. కత్తులు దూసుకునే వరకు దారితీసింది.
రెండు వర్గాల వారు ముష్టియుద్ధానికి దిగి కుర్చీలు, ప్లేట్లు, చెంచాలు విసురుకున్నారు. పెండ్లి ఊరేగింపు కాస్తా రక్తపు మడుగుగా మారింది. ఈ ఘర్షణలో కత్తి తగిలి 20 ఏళ్ల సన్నీ చనిపోయాడు. దాదాపు 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతరం వధువు కుటుంబీకులు పరారయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఆగ్రా రూరల్ ఎస్పీ సత్యజిత్ గుప్తా తెలిపారు.