కడప : కడప జిల్లాలోని ఖాజీపేటలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థినిని ఓ యువకుడు గొంతు కోసి కిరాతకంగా హత్య చేశాడు. ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఖాజీపేటకు చెందిన కీర్తన ఇంటర్మీడియట్ చదువుతోంది. పరీక్షలు పూర్తికావడంతో ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటోంది.
శుక్రవారం ఉదయం ఆమె తల్లిదండ్రులు వ్యాపార పనులపై బయటకు వెళ్లారు. ఇంట్లో కీర్తన ఒంటరిగా ఉన్న సమయంలో వెంకటేశ్ అనే యువకుడు వచ్చి, ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు.. తమ కుమార్తె రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి షాక్కు గురయ్యారు. ఆరు నెలల క్రితం నిందితుడు వెంకటేశ్ మా ఇంటికి వచ్చి కీర్తన సోషల్ మీడియాలో ఫొటోలు పెడుతోందని, కంట్రోల్లో పెట్టుకోవాలని హెచ్చరించాడని తల్లిదండ్రులు తెలిపారు.
అయితే తమ కుమార్తె వద్ద అసలు ఫోనే లేదని చెప్పారు. అప్పటి నుంచి ఆమెపై కక్ష పెంచుకుని ఈ దారుణానికి పాల్పడ్డాడని వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఆరోపించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు వెంకటేశ్ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ హత్యతో ఖాజీపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.