Mundra Port Heroin Seizure Case | గతేడాది సెప్టెంబర్లో అదానీకి చెందిన ముంద్రా పోర్ట్లో దాదాపు 3వేల కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక చర్యలు చేపట్టింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ సోమవారం మరో అనుబంధ చార్జిషీట్ను దాఖలు చేసింది. ఇందులో ఆరుగురు ఆఫ్ఘన్ పౌరులు, ఏడు సంస్థలు సహా 22 మంది నిందితులుగా చేర్చింది. హెరాయిన్ వ్యవహారంలో లష్కరే తోయిబా పాత్ర తెరపైకి వచ్చింది. హెరాయిన్ విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో 16 మంది నిందితులపై మార్చి 14న, 2022న ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది.
ఆ తర్వాత ఆగస్ట్ 29న మరో తొమ్మిది మందిపై తొలి అనుబంధ ఛార్జిషీటు దాఖలు చేసింది. గుజరాత్లోని ముంద్రా పోర్ట్లో 2,899 హెరాయిన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇరాన్లోని బందర్ అబ్బాస్ ద్వారా ఆఫ్ఘనిస్థాన్కు అక్కడి నుంచి భారత్కు పంపినట్లుగా తేలింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్కు అక్రమ హెరాయిన్ను తరలించేందుకు కుట్ర పన్నినట్లు విచారణలో తేలిందని అధికారులు పేర్కొన్నారు. 22 మంది నిందితులపై సప్లిమెంటరీ ఛార్జిషీట్లో ఎన్ఐఏ ప్రధాన నిందితుడిగా హర్ప్రీత్ సింగ్ తల్వార్ అలియాస్ ‘కబీర్ తల్వార్’ని పేర్కొంది. హెరాయిన్ను భారతదేశంలోకి అక్రమంగా రవాణా చేయడానికి సముద్ర మార్గాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాడని అధికారులు పేర్కొనగా.. గత ఏడాది ఆగస్టులో కబీర్ తల్వార్ను అరెస్టు చేశారు.