ముంబై: ఎయిర్ ఇండియా విమానంలో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని ఉద్యోగం నుంచి అమెరికా కంపెనీ తొలగించింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు తీవ్ర ఆందోళనకు గురి చేసినట్లు వెల్స్ ఫార్గో సంస్థ తెలిపింది. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన 34 ఏళ్ల శంకర్ మిశ్రా నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాడు. బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేసిన అతడు మద్యం మత్తులో ఒక వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అదృశ్యమైన శంకర్ మిశ్రాను అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలు వెతుకుతున్నాయి. అతడి కోసం లుకౌట్ నోటీస్ కూడా జారీ చేశారు.
కాగా, అమెరికా ఆర్థిక సేవల సంస్థ వెల్స్ ఫార్గోలో భారత్ వైస్ ప్రెసిడెంట్గా శంకర్ మిశ్రా పని చేస్తున్నాడు. అయితే మహిళా ప్రయాణికురాలిపై అతడు మూత్ర విసర్జన చేసిన విషయం ఆ సంస్థకు తెలిసింది. దీంతో ఆయనపై చర్యలు చేపట్టింది. శంకర్ మిశ్రాను తమ సంస్థ నుంచి తొలగించినట్లు పేర్కొంది. ‘ఉద్యోగుల వృత్తిపరమైన, వ్యక్తిగత ప్రవర్తనకు వెల్స్ ఫార్గో అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉంది. ఆయనపై వచ్చిన ఈ ఆరోపణలు మమ్మల్ని తీవ్రంగా కలవరపెట్టాయి. ఆ వ్యక్తిని వెల్స్ ఫార్గో నుంచి తొలగించాం’ అని ఆ కంపెనీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. శంకర్ మిశ్రాపై వచ్చిన ఆరోపణలపై దర్యప్తు సంస్థలకు సహకరిస్తామని వెల్లడించింది.