BJP | న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ వేదికగా బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ అభ్యంతరకర, మత విద్వేష వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీకి చెందిన ముస్లిం ఎంపీ కున్వర్ డానిష్ అలీనికి ఉద్దేశించి ‘ముస్లిం ఉగ్రవాది’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం రాత్రి చంద్రయాన్-3 విజయంపై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ బిధూరీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. బిధూరీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశాయి. బిధూరీ వెంటనే క్షమాపణలు చెప్పాలని పేర్కొన్నాయి. బిధూరీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ఆయన పక్కనే ఉన్న బీజేపీ ఎంపీలు హర్షవర్ధన్, రవిశంకర్ ప్రసాద్లు నవ్వుతూ కనిపించడం మరింత విమర్శలకు దారితీసింది.
బిధూరీ చేసిన వ్యాఖ్యలు ఎంపీలందరికీ అవమాకరమని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అన్నారు. ముస్లింలు, ఓబీసీలను దూషించడం బీజేపీ సంస్కృతిలో అంతర్భాగమని టీఎంసీ ఎంపీ మొయిత్రీ విమర్శించారు.
బిధూరీ వాడిన భాష ఆరెస్సెస్ నేర్పిన విలువల ఫలితమేనా! అని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బిధూరీని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందా? లేక ప్రమోషన్ ఇస్తుందా? అని ఎన్సీపీ నేత ైక్లెడ్ క్రాస్టో ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీల వికృతమైన సంస్కృతికి ప్రధాని మోదీనే కారణమని ఆర్జేడీ అధ్యక్షుడు లాలా ప్రసాద్ యాదవ్ విమర్శించారు.
కాగా, తనపై బిధూరీ చేసిన వ్యాఖ్యలను ప్రివిలేజ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేస్తూ ఎంపీ డానిష్ అలీ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని ఆయన కోరారు. మరోవైపు ఎంపీ బిధూరీపై బీజేపీ ఇంకా చర్యలు తీసుకోకపోవడాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆక్షేపించారు. బిధూరీ వ్యాఖ్యలను లోక్సభ రికార్డుల నుంచి తొలగించగా, ఆ వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. రమేశ్ బిధూరీ వ్యాఖ్యల పట్ల స్పీకర్ ఓంబిర్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిధూరీకి బీజేపీ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీచేసింది.
‘పార్లమెంట్ సాక్షిగా బీజేపీ ఎంపీ బిధూరీ నాపై చేసిన వ్యాఖ్యలు విద్వేష ప్రసంగం కంటే తక్కువేం కాదు. బిధూరీ యావత్తు దేశం సిగ్గుపడేలా ప్రవర్తించారు. ఆయన్ను వెంటనే లోక్సభ నుంచి సస్పెండ్ చేయాలి. బీజేపీ ఎంపీలు ఇటువంటి విద్వేష ప్రసంగాలను ఆరెస్సెస్ శాఖల్లో లేదా ప్రధాని మోదీ కొత్త భారత ప్రయోగశాలలో నేర్చుకొంటున్నారా? బిధూరిపై చర్యలు తీసుకోకుంటే నా లోక్సభ సభ్యత్వాన్ని వదులుకుంటా’
-మీడియాతో ఎంపీ డానిష్ అలీ