న్యూఢిల్లీ, ఆగస్టు 16: కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నాయకులు చెప్పారు. ఈ కమిటీ సమావేశం ఈ నెల 22న ఢిల్లీలో జరుగనున్నది. ఈ నేపథ్యంలో ఎస్కేఎం నాయకుడు హన్నన్ మొల్లా మాట్లాడుతూ ‘ఈ కమిటీతో అయ్యేది కాదు.. పోయేది కాదు. కొంతమంది రైతులమని చెప్పుకునే వారిని కమిటీలో నియమించారు. రైతుల ప్రయోజనాల కోసం పోరాడే కమిటీ కాదు ఇది. అందుకే గతంలోనే ఈ కమిటీని వ్యతిరేకించాం.
అలాంటప్పుడు ఈ కమిటీ తొలి సమావేశానికి ఎలా హాజరవుతాం. రైతుల ప్రయోజనాలను కాపాడటానికి ఇంకా ఏ విధంగా పోరాడాలన్నదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. మరో నాయకుడు దర్శన్పాల్ స్పందిస్తూ ‘ఎంఎస్పీ, రైతులపై కేసుల ఎత్తివేత, సాగుచట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం తదితర హామీలన్నింటినీ కేంద్రం గాలికొదిలేసింది. ఏదో ఒక కమిటీని ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నది’ అని పేర్కొన్నారు.