న్యూఢిల్లీ, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై ఆప్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసు విచారణలో ఈడీ అధికారుల విచారణ తీరు దారుణంగా ఉన్నదని, విచారణకు పిలిచి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. పైనుంచి వస్తున్న ఒత్తిడి మేరకు తాము చెప్పిన స్టేట్మెంట్లు ఇవ్వాలని, పలువురు నేతల పేర్లు చెప్పాలని బెదిరిస్తున్నారని, విచారణ ఎదుర్కొంటున్న వారి భార్య, బిడ్డలు, ఇతర కుటుంబసభ్యులను కూడా భయాందోళనకు గురిచేస్తున్నారని చెప్పారు. ఇందుకు గానూ ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న పలువురు కోర్టులో వేసిన పిటిషన్లలో పేర్కొన్న విషయాలను ఉదహరించారు. బుధవారం సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను చేస్తున్నవి ఆరోపణలు కావని, ఈడీ అధికారులు పెడుతున్న చిత్రహింసలను పలువురు తమ గోడును కోర్టుకు వెళ్లబోసుకొన్నారని తెలిపారు. పిటిషనర్ల మెడికల్ సర్టిఫికెట్లను ఈ సందర్భంగా మీడియాకు చూపించిన సంజయ్ సింగ్.. ఈడీ అధికారుల చిత్రహింసలపై సంబంధిత వివరాలు, డాక్యుమెంట్లను పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి సమర్పిస్తానని, అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతానని పేర్కొన్నారు.
కొట్టడంతో వినికిడి లోపం
ఈడీ అధికారులు చిత్రహింసలు, ఇతర రకాల వేధింపులకు గురైన వారు పలు కోర్టుల్లో పిటిషన్లు వేశారని సంజయ్ సింగ్ పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి సంబంధీకుడు చందన్ అనే వ్యక్తి ఈడీ అధికారుల తీరుపై ఫిర్యాదు చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారని తెలిపారు. చందన్ ఇంటిలో సోదాలు చేసే సమయంలో ఈడీ అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, తీవ్రంగా కొట్టి హింసించారని, కుటుంబసభ్యులను కూడా భయాందోళనకు గురిచేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారని వివరించారు. అధికారులు అతడి చెవిపై పదేపదే కొట్టడంతో, వినికిడి లోపం వచ్చిందని, ఈ విషయాన్ని వైద్యులు కూడా ధ్రువీకరించారని, 4 రోజుల పాటు దవాఖానలో చికిత్స తీసుకొన్నారని సంజయ్ సింగ్ తెలిపారు.
అధికారుల బెదిరింపు పర్వం
మద్యం కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త అరుణ్రామచంద్రన్ పిైళ్లె కూడా ఈడీ అధికారులకు ఇచ్చిన తన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకొనేందుకు ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన విషయాన్ని సంజయ్ సింగ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ విషయంలో ఈడీ అధికారుల బెదిరింపుల పర్వం ఉన్నదని, అధికారులు తాము రాసిన స్టేట్మెంట్పై పిైళ్లెతో సంతకం చేయించుకొనేందుకు పిైళ్లెతో పాటు ఆయన భార్య, బిడ్డలను కూడా బెదిరించారని పేర్కొన్నారు. మరో నిందితుడు సమీర్ మహేంద్రు కుటుంబసభ్యులను కూడా ఇదేవిధంగా భయాందోళనకు గురిచేశారని, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు మహేంద్రు భార్యను ఈడీ కార్యాలయానికి పిలిపించారని అన్నారు. ఈ విషయాలను సమీర్ న్యాయస్థానం ముందు చెప్పారని, తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చేందుకు ఈడీ అధికారులు ఒత్తిడి చేసిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారని వెల్లడించారు. స్టేట్మెంట్లలో తాము చెప్పిన రాజకీయ నాయకుల పేర్లు చెప్పాలంటూ ఈడీ అధికారులు బెదిరింపులకు పాల్పడిన విషయాన్ని మరో నిందితుడు మాగుంట రాఘవరెడ్డి కూడా కోర్టుకు ఫిర్యాదు చేశారని వివరించారు.
ఎవరి ఆదేశాల మేరకు ఇలా?
నిందితులను, సాక్షులను బెదిరిస్తున్న, చిత్రహింసలకు గురిచేస్తున్న ఈడీ అధికారుల పేర్లు, ఇతర వివరాలను త్వరలో సమర్పిస్తానని సంజయ్ సింగ్ పేర్కొన్నారు. ఎవరి కోసం, ఎవరి ఆదేశాల మేరకు ఈడీ ఇలా వ్యవహరిస్తున్నదని ఆయన సూటిగా ప్రశ్నించారు. విచారణ ప్రక్రియలో ఈడీ అధికారులు కానివారు కూడా కొంతమంది ఉంటున్నారని ఆరోపించారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వ్యక్తిగత కార్యదర్శి రింకుకు ఫోన్ చేసి ఈడీ కార్యాలయానికి రావాలని పిలుస్తున్నారని, లేకుంటే ‘నీ బిడ్డ కాలేజీకి ఎలా వెళ్తుంది’ అంటూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎనిమిదేండ్లలో ఈడీ వేల కేసులు నమోదు చేయగా, అందులో శిక్ష పడ్డవి 0.5 శాతం మాత్రమేనని, దీని ద్వారా కేంద్రం దర్యాప్తు సంస్థలను ఎలా దుర్వినియోగం చేస్తున్నదో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈడీ కేసుల తీరుపై గణాంకాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తూ తనకు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారని, ఇప్పుడు ఈడీ అధికారుల విచారణ తీరును డాక్యుమెంట్లతో సహా ప్రివిలేజ్ కమిటీ ముందుకు తీసుకెళ్తానని సంజయ్ సింగ్ పేర్కొన్నారు. అసలు ఢిల్లీ మద్యం పాలసీలో స్కామ్ లేదని, దాన్ని సృష్టించారని అన్నారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం, ఆప్ను బద్నాం చేసేందుకే లిక్కర్ పాలసీలో స్కామ్ జరిగిందని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.