లక్నో: ఉత్తరప్రదేశ్లో ఎన్నికల నగారా మోగింది. అధికారాన్ని నిలుపుకోవడానికి బీజేపీ, మరోసారి సీఎం పదవి దక్కించుకోవాలని సమాజ్వాదీ పార్టీ, పూర్వవైభవం సాధించాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నాయి. అయితే మహారాష్ట్రలో అధికార కూటమికి నేతృత్వంవహిస్తున్న శివసేన.. యూపీ ఎన్నికల్లో బరిలోకి దిగనున్నట్లు ప్రకటించింది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో 50 నుంచి 100 సీట్లలో పోటీ చేస్తామని పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.
ఈ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీచేస్తామని చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీతో అధికారాన్ని పంచుకుంటున్న విషయం తెలిసిందే. అయితే యూపీలో మాత్రం ఎవరితో పొత్తుపెట్టుకోవడం లేదని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ తమకు సైద్ధాంతిక పరమైన విభేదాలు ఉన్నాయని చెప్పారు.
ఉత్తరప్రదేశ్లో శివసేన చాలాకాలంగా పనిచేస్తున్నదని వెల్లడించారు. అయితే తమ పాత మిత్రపక్షం బీజేపీకి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంలో ఇన్నాళ్లు రాష్ట్రంలో ప్రత్యక్ష పోటీకి దూరంగా ఉన్నామని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తామని, 50 నుంచి 100 మంది అభ్యర్థులను బరిలో నిలుపుతామన్నారు.