ముంబై: కశ్మీర్ లాంటి సున్నితమైన అంశంపై రాజకీయాలు చేయడం సరికాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. కశ్మీరీ పండిట్ల అంశంపై తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ కేవలం సినిమా మాత్రమేనని చెప్పారు. ఈ సినిమా వల్ల వచ్చే ఎన్నికల్లో ఏఒక్కరికీ రాజకీయ ప్రయోజనం చేకూరుతుందని తాను అనుకోవడంలేదని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ సినిమాను ప్రజలు మర్చిపోతారని ఆయన వెల్లడించారు.
1990లో కశ్మీరీ పండిట్ల మారణహోమం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రశంసలతోపాటు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. చాలా మంది ప్రముఖులు ఈ సినామాపై అభ్యంతరం వ్యక్తంచేశారు. సినిమాలో చాలా విషయాలను తప్పుగా చూపించారని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. 1990లో కశ్మీర్లో పండిట్లపై దాడులు జరిగిన సమయంలో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం అధికారంలో ఉన్నట్లు చూపించారని ఒమర్ అబ్దుల్లా చెప్పారు.
ఆ సమయంలో జమ్ముకశ్మీర్లో రాష్ట్రపతి పాలన అమలులో ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ కూటమి అధికారంలో ఉందని చెప్పారు. ఇక దాడుల్లో కశ్మీర్ పండిట్లు మరణించడం విచారకరమన్నారు. అల్లర్ల కారణంగా ఎంతో మంది మస్లింలు, సిక్కులు కూడా ప్రాణాలు కోల్పోయారన్నారు. వలస వెళ్లిన ముస్లింలు చాలా మంది తిరిగి రాలేదన్నారు. కాగా, 1990 నాటి అల్లర్ల సమయంలో ఎవరు అధికారంలో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు.