Rajasthan Elections | లక్నో, అక్టోబర్ 20: విపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీల నుంచి కాంగ్రెస్కు కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని, తమకు కేటాయించాల్సిన సీట్ల గురించి పట్టించుకోకుండా ఏకపక్షంగా తమ అభ్యర్థులను ప్రకటించిందని గురువారం సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా ధ్వజమెత్తారు.
ఇప్పుడు తాజాగా కూటమిలోని మరో భాగస్వామ్య పార్టీ అయిన రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) రాజస్థాన్లో కాంగ్రెస్ వైఖరిపై మండిపడుతున్నది. రాజస్థాన్లో కనీసం ఆరు సీట్లను తమకు కేటాయించాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నది. ఆర్ఎల్డీ పార్టీ 2018 రాజస్థాన్ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసింది. భరత్పూర్, మల్పూర్లో పోటీచేసిన ఈ పార్టీ భరత్పూర్లో విజయం సాధించింది. ఇండియా కూటమిలో కాంగ్రెస్తో భాగస్వామిగా ఉన్న ఆర్ఎల్డీ కూటమి పొత్తు కేవలం లోక్సభ ఎన్నికలకే పరిమితం కాదని, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పొత్తు ధర్మాన్ని పాటించాలంటూ పేర్కొంటున్నది. జాట్ల ప్రాబల్యం ఎక్కువగా జిల్లాల్లో తమకు సీట్లు కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్నది. 10 శాతం జనాభా ఉన్న జాట్లు 40 సీట్లలో ప్రభావం చూపుతారని అంచనా.