న్యూఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా తొక్కిపెట్టిందని టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వర్ రావు దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణపై తేల్చాలంటూ టీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. అందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసినట్లు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ.. ఎనిమిదేండ్లుగా అణగారిన వర్గాలను మోసం చేస్తోందని నామా విమర్శించారు. ఉభయ సభల నుంచి వాకౌట్ చేసిన అనంతరం ఎంపీ నామా నాగేశ్వర్ రావు మీడియాతో మాట్లాడారు.
నవంబర్ 29, 2014న అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపామని టీఆర్ఎస్ ఎంపీ గుర్తు చేశారు. ఈ తీర్మానంపై కేంద్రం స్పందించడం లేదు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య దేశంలో ఎస్సీలు అణచివేతకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీల సమస్యల మీద మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరినప్పటికీ, ఆయన స్పందించలేదని తెలిపారు. ఎస్సీలలో 59 ఉపకులాలు ఉన్నాయి. వీరి జనాభా ప్రతిపాదికన ఆధారంగా వారికి న్యాయం జరగాలన్నారు. అధికారం, పెత్తనం మీ దగ్గర పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.
2014లో ఎన్నికల ముందు ఇదే బీజేపీ నాయకులు.. ఎస్సీ వర్గీకరణపై మాట్లాడారు. 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటనలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ అణగారిన కులాలను ఇంకా అణగదొక్కుతూనే ఉంది. రాష్ట్రాలకు అధికారాలు ఇస్తే ఈ సమస్యకు 24 గంటల్లో పరిష్కారం తీసుకొస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీ తీర్మానంపై ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ పలు లేఖలు రాశారు. మంత్రుల బృందం కూడా కేంద్ర మంత్రులను కలిసింది. కానీ కేంద్రం నుంచి స్పందన లేదు. ఎస్సీలను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని ఎస్సీలు నిలదీయాల్సిన అవసరం ఉందని నామా నాగేశ్వర్ రావు పేర్కొన్నారు.