MP K.Keshava Rao | హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): మహిళా బిల్లు కోసం పోరాటాలు చేసిన వారి కలలు సాకారం అవుతున్నప్పటికీ.. వాటి నిజమైన ఫలాలు అందుకోవడానికి మరో పదేండ్లు ఆగాల్సి రావటం దురదృష్టకరమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. బ్రిటీష్ కాలం నుంచి మహిళలకు రాజ్యాధికారంలో భాగం కావాలని ఎంతోమంది పోరాటం చేశారని అన్నారు. 1920వ దశకం చివరాంకంలో చామ్స్ఫర్డ్ కమిటీ ముందు సరోజినీనాయుడు చేసిన వాదనను ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘రాజ్యాధికారంలో మహిళా భాగస్వామ్యం లేని సమాజం పురోగమించదు’ అని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వ్యాఖ్యలను ఉదహరించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశంలోనే మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఉండాలని ఏకగ్రీవ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. తమ నాయకుడు, సీఎం కేసీఆర్ మహిళలు రాజ్యాధికారంలోకి రావాలనే తన ఆకాంక్షను చిత్తశుద్ధితో వెల్లడించటమే కాకుండా ఇటీవల మహిళా బిల్లు విషయంలో ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. తాము నూటికి నూరుపాళ్లు బిల్లును స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ బిల్లును జనగణనతో, నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. కేంద్రం తలచుకుంటే, బిల్లును తక్షణమే అమల్లోకి తేవచ్చని, అందుకు 2011 జనాభాలెక్కలను పరిగణనలోకి తీసుకోవచ్చని సూచించారు. దేశమంతా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం మహిళా బిల్లు విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నదని ప్రశ్నించారు.
మహిళా సాధికారత సాధించటంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉన్నదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. రాజ్యసభలో మహిళా బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా, సామాజికంగానే కాకుండా రాజకీయంగా ఎదగాలని సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల్లోనే కాకుండా మార్కెట్ కమిటీల్లో సైతం రిజర్వేషన్లు కల్పించి దేశానికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన రాణీ రుద్రమ దగ్గరి నుంచి రాజ్యాన్ని ధిక్కరించిన సమ్మక్క-సారక్క, ఆయుధం చేపట్టి పోరాడిన చాకలి ఐలమ్మ వంటి ఆదర్శమూర్తుల ఆకాంక్షలను తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు. అలాగే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో సీఎం కేసీఆర్ మహిళలను భాగస్వాములను చేయటంతో అద్భుత ఫలితాలు వస్తున్నాయని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకోసం ఎమ్మెల్సీ కవిత దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
మహిళా బిల్లును నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో ముడిపెట్టిన క్రమంలో తక్షణమే కేంద్రం ఆ ప్రక్రియను ప్రారంభించాలని కేశవరావు డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన జనగణనతో ముడిపడి ఉన్నదని, దీనిద్వారా దక్షిణభారతదేశానికి తీరని అన్యాయం జరుగబోతున్నదన్నారు. కుటుంబ నియంత్రణ చర్యలు తీసుకోవాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాన్ని పాటించి గౌరవించినందుకు దక్షిణభారతదేశం మూల్యం చెల్లించుకోవాల్సి రావటం దురదృష్టకరమని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో ఎన్నికల కమిషన్ రాజకీయాలకు అతీతంగా శాస్త్రీయంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వంటి అనేక దక్షిణాది రాష్ర్టాలకు ఉత్తరాది రాష్ర్టాలతో పోలిస్తే సీట్ల సంఖ్య తగ్గుతుందని, తద్వారా రిజర్వేషన్ల అమలులో తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఈ అంతరాన్ని సరిచేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉన్నదని అన్నారు.