భోపాల్ : ఈ ఏడాదిలో జరిగే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై పాలక బీజేపీ, విపక్ష కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని, కాంగ్రెస్ ఘనవిజయం ఖాయమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందని, తాను లిఖితపూర్వకంగా ఈ విషయం చెప్పగలనని, బీజేపీ డబ్బు, ప్రలోభాలతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని మధ్యప్రదేశ్లో ప్రతి ఒక్కరికీ తెలుసని రాహుల్ పేర్కొన్నారు.
కాగా, మధ్యప్రదేశ్ ఎన్నికలను కాంగ్రెస్ క్లీన్స్వీప్ చేస్తుందని రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఎద్దేవా చేశారు. తమ గురించి సానుకూలంగా మాట్లాడుకుని సంతృప్తి చెందాలన్నదే రాహుల్ ఆలోచనని శివరాజ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొంది పాలక బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని పేర్కొన్నారు.
ఇక 2024 జనవరి 6తో మధ్యప్రదేశ్ అసెంబ్లీ గడువు ముగియనుంది. 2018 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమల్నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగా, జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ను వీడి బీజేపీ పంచన చేరడంతో కమల్ నాథ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆపై బీజేపీ ప్రభుత్వం కొలువుతీరడంతో మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ చౌహాన్ పాలనా పగ్గాలు చేపట్టారు.