ఇండోర్: ఎన్నికల వేళ నేతలు ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తుంటారు. రకరకాల బహుమానాలు ప్రకటిస్తుంటారు. సాధారణంగా మిక్సీలు, గ్రైండర్లు, చీరలను ఓటర్లకు బహుమానాలుగా ఇస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో మాత్రం ఓటర్లను ఓ వెరైటీ ఆఫర్ ఊరిస్తోంది. అయితే, ఆ వినూత్న ఆఫర్ ఇచ్చింది రాజకీయ పార్టీలు కాదు, నేతలు కాదు. ఓ ప్రముఖ ఫుడ్ హబ్ ఈ ఆఫర్ చేసింది.
సాధారణంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమవుతుంది. కానీ ఓటర్లు మాత్రం తీరిగ్గా 10 గంటలు దాటాక పోలింగ్ బూత్లకు క్యూ కడుతుంటారు. అందుకే ఓటింగ్ మొదలు కాగానే ఓటర్లు పోలింగ్ కేంద్రాలు వచ్చేలా చేసేందుకు ఓ ఫుడ్ హబ్ వినూత్న ఆఫర్ చేసింది. ఉదయం తొమ్మిది గంటల లోపు ఓటు వేయటానికి వచ్చిన వాళ్లకు పోహా, జిలేబీలు ఫ్రీగా ఇస్తామని ఇండోర్లోని ‘56 దుకాణ్’ యజమానుల సంఘం ప్రకటించింది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నవంబర్ 17న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దాంతో నవంబర్ 17న ఉదయం తొమ్మిది గంటలలోపు ఓటువేసి వచ్చిన వాళ్లకు ఫ్రీగా పోహా, జిలేబీలను ఇస్తామని ‘56 దుకాణ్’ అసోసియేషన్ అధ్యక్షుడు గుంజన్ శర్మ తెలిపారు. తొమ్మిది గంటల తర్వాత ఓటేసి వచ్చిన వారికి పోహా, జిలేబీలను ఇస్తామని తెలిపారు. ఈ ఆఫర్ నవంబర్ 17 ఉదయం 9గంటల వరకు మాత్రమే ఉంటుందని ఈ అవకాశాన్ని ఓటర్లు వినియోగించుకోవాలని కోరారు.