బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ డర్టీ పాలిటిక్స్ వల్లే తమ పార్టీ ఎమ్మెల్యేలను రిసార్ట్కు తరలించినట్లు కర్ణాటక మాజీ సీఎం, జేడీ(ఎస్) చీఫ్ హెచ్డీ కుమారస్వామి తెలిపారు. ఆ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ సీఎం సిద్ధ రామయ్యపై నేరుగా ఆయన మండిపడ్డారు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించాలన్న ఆసక్తి ఆయనకు లేదని విమర్శించారు. కేవలం జేడీ(ఎస్)పైనే పగ ఉందన్నారు. అందుకే తమ అభ్యర్థి ఓడిపోవాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నదని అన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురి కాకుండా జేడీ(ఎస్) ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సి వస్తుందని అన్నారు. లౌకిక శక్తుల బలోపేతం కోసం జేడీ(ఎస్) అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని తొలుత ఆయన పిలుపునిచ్చారు.
కాగా, శుక్రవారం రాజ్యసభ ఎన్నికలు జరుగనున్నాయి. కర్ణాటకలోని నాలుగు స్థానాలకుగాను ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. 45 ఓట్లు కావాల్సి ఉండగా, బీజేపీ తన సంఖ్యా బలంగా ఆధారంగా ఈజీగా రెండు సీట్లు గెలువనున్నది. అయితే తగినంత సంఖ్యా బలం లేనప్పటికీ నాలుగో సీటును దక్కించుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) పోటా పోటిగా ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దించాయి. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల ప్రలోభాలకు గురి కాకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.