ముంబై, మే 31: ముక్కు పచ్చలారని చిన్నారులు వాళ్లు.. తల్లి కొంగుచాటు పిల్లలు.. ఏ కష్టమొచ్చినా ముందుగా తల్లికే చెప్పుకొంటారు.. అలాంటి కన్నతల్లే ఆ పిల్లల పట్ల యమదూతగా మారింది. కన్న పిల్లల ప్రాణాలు బలితీసుకున్నది. మూర్ఖత్వం అనాలో.. మొండితనం అనాలో.. క్షణికావేశం అనాలోకానీ.. ఆ తల్లి అనాలోచిత నిర్ణయానికి ఆరుగురు పసిపిల్లలకు నూరేండ్లు నిండిపోయాయి. రునా చిఖూరి సహానీ అనే 30 ఏండ్ల మహిళ తన ఆరుగురు పిల్లలను బావిలో పడేసింది. వారంతా చనిపోయే దాకా ఒడ్డునే కూర్చుని చూస్తూ ఉండిపోయింది. వారిలో ఐదుగురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు. పిల్లలందరికీ 18 నెలల నుంచి పదేండ్ల వయస్సు మాత్రమే ఉంటుంది. ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలోని రాయ్గఢ్ జిల్లాలో ఉన్న మహద్ తాలూకా ఖరవళి గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. భర్త తాగుడు విషయంలో తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. సోమవారం రాత్రి కూడా వీరిద్దరి మధ్య తగాదా జరిగింది. దీంతో కోపానికి గురైన రునా.. పిల్లల్ని తీసుకుని ఊరి సమీపంలోని ఓ బావిలో పడేసింది. అనంతరం వారు చనిపోయారని భావించి తాను కూడా దూకాలని ప్రయత్నించగా, అప్పటికే గమనించిన స్థానికులు ఆమెను కాపాడారు. పోలీస్స్టేషన్కు తీసుకెళ్లగా పోలీసులు అరెస్టు చేశారు.