కళ్ల ముందే ఒక పులి వచ్చి తన బిడ్డను పట్టుకెళ్లడం చూసిందా తల్లి. అంతే బిడ్డను కాపాడుకోవాలనే ఆలోచనతో తను ఏం చేస్తున్నానో కూడా మర్చిపోయింది. పులి వెంటపడి దాంతో వట్టి చేతులతో పోరాడింది. పులి మొఖంపై పిడిగుద్దుల వర్షం కురిపించింది. దాంతో పిల్లాడిని వదిలేసిన పులి.. ఆ తల్లిపై దాడి చేసింది. పోరాడుతూ ఆమె చేసిన ఆర్తనాదాలు విన్న గ్రామస్థులు కర్రలు పట్టుకొని రావడంతో పులి పారిపోయింది.
ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఉమేరియా జిల్లాలో వెలుగు చూసింది. సదరు పులి ఆ ఊరి పరిసరాల్లో కొన్నిరోజులుగా తిరుగుతోందని, ఊళ్లోని పశువులను వేటాడేందుకు ప్రయత్నించిందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో కాలకృత్యాలు తీర్చుకుంనేందుకు పదిహేను నెలల పిల్లాడు రాజ్వీర్ను తీసుకొని వెళ్లిన అర్చన (22) ఆ పులి కంటపడింది. వెనుక నుంచి వచ్చి రాజ్వీర్ తలను నోటకరచుకొని పరుగుతీసింది. అది చూసిన అర్చన.. పులి వెంటపడి దాంతో పోరాడింది.
దాంతో బిడ్డను వదిలేసిన పులి.. ఆమెతో కలబడింది. అదే సమయంలో గ్రామస్థులు అక్కడకు రావడంతో పులి పారిపోయినట్లు అధికారులు వెల్లడించారు. రాజ్వీర్ తలకు గాయమైందని, అయితే ఇప్పుడు ఆ పసికందు బాగానే ఉన్నాడని పోలీసులు తెలిపారు. అర్చన శరీరంలో చాలా ఎముకలు విరిగాయని, మెడ భాగంలో కూడా గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.