అక్కడ అప్పటిదాకా సందడే సందడి.. వందల ఏండ్ల నాటి కేబుల్ బ్రిడ్జిని చూడ్డానికి భారీగా పర్యాటకులు తరలివచ్చారు.. దాంతో ఆ ప్రాంతమంతా మహిళలు, పిల్లలతో ఆహ్లాదంగా కనిపించింది.. కానీ, ఆ సందడి క్షణాల్లోనే మాయమైపోయింది. ఒక్కసారిగా పెద్ద కుదుపు.. ఏం జరుగుతుందో తెలుసుకొనేలోపే వందల మంది నీళ్లలో పడిపోయారు. ఈతరానివాళ్లు నదిలో కొట్టుకుపోయారు. కాపాడండీ! అంటూ అక్కడున్నవారి ఆర్తనాదాలు మిన్నంటాయి. కాసేపటికే 90 మంది శవాలై తేలారు.
అహ్మదాబాద్, అక్టోబర్ 30: గుజరాత్లో ఆదివారం ఘోర విషాదం చోటుచేసుకొన్నది. మోర్బి జిల్లాలోని మచ్చు నదిపై ఉండే కేబుల్ బ్రిడ్జి కుప్పకూలింది. ఈ ఘటనలో 90 మంది మరణించగా, పదుల సంఖ్యలో మందికి గాయాలయ్యాయి. కేబుల్ బ్రిడ్జి తెగిపోవడంతో పెద్దసంఖ్యలో పర్యాటకులు నదిలో పడిపోయారు. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మంది ఉన్నట్టు సమాచారం. వీరిలో 100 మందికి పైగా నీటిలో మునిగిపోయారని అధికారులు తెలిపారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్తో పాటు ఇతర రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని బోట్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అంబులెన్సుల్లో సమీప దవాఖానలకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని డీజీపీ అశిష్ భాటియా పేర్కొన్నారు. సామర్థ్యానికి మించి పర్యాటకులు వంతెనపై నిలబడటంతోనే కూలినట్టు అధికారులు భావిస్తున్నారు.
ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 765 అడుగుల పొడవు ఉండే ఈ కేబుల్ బ్రిడ్జిని 1879లో నిర్మించారు. ఇటీవలే దాన్ని ఆధునీకరించి పర్యాటకుల కోసం ఈ నెల 26న తిరిగి ప్రారంభించారు. అయితే ఆధునీకరణలో అవకతవకలు చోటుచేసుకున్నట్టు తెలుస్తున్నది. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండానే బ్రిడ్జిని పునఃప్రారంభించినట్టు తెలిసింది.
కాగా, కోల్కతా ఫ్లైఓవర్ కూలినప్పుడు ఒకలా, గుజరాత్లో కేబుల్ వంతెన కూలితే ఒకలా స్పందించిన ప్రధాని మోదీ తీరుపై నెటిజన్లు విమర్శలు ఎక్కుపెట్టారు. 2016లో కోల్కతాలో ఫ్లైఓవర్ కూలిపోతే.. బెంగాల్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని దేవుడు సందేశమిచ్చాడని మోదీ వ్యాఖ్యానించారు. ఇప్పు డు మాత్రం గుజరాత్కు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. దీనిపై నెటిజన్లు స్పం దిస్తూ.. మరిప్పుడు గుజరాత్ సర్కారును పడగొట్టాలని దేవుడు సందేశం ఇవ్వలేదా? అని మోదీకి చురక అంటించారు.
మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ప్రమాదంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.