న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రస్తుతం టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు గాల్లో దీపంలా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం, ఇతర మార్కెట్ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దిగ్గజ ఐటీ కంపెనీలు వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ట్విట్టర్, మెటా, అమెజాన్ వంటి సంస్థల్లో ఆందోళకర స్థాయిలో ఈ తొలగింపు జరుగుతుండగా.. మరికొన్ని కంపెనీలు కూడా ఆ దారిలోనే నడుస్తున్నాయి. గత కొన్ని వారాల్లో ట్విట్టర్, మెటా, అమెజాన్ తదితర సంస్థలు వేల మంది ఉద్యోగులపై వేటు వేశాయి. 2025 నాటికి 4-6 వేల మంది తొలగిస్తామని తాజాగా హెచ్పీ సంస్థ ప్రకటించింది. ఆర్థిక మాంద్యం భయాలు, మార్కెట్ ఒడిదొడుకులు, ఆదాయ క్షీణత కారణంగానే ఉద్యోగులను తొలగిస్తున్నట్టు కంపెనీలు చెబుతున్నాయి.
ట్విట్టర్ను చేజిక్కించుకొన్న ఎలాన్ మస్క్.. సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్తో మొదలుపెట్టి కంపెనీలో ఉన్నతస్థాయిలో ఉన్నవారితోసహా దాదాపు 5,000 మంది ఉద్యోగులపై వేటు వేశారు. భారత్లోనూ దాదాపు 200 మందిని తొలగించారు. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా సైతం 11 వేలమంది ఉద్యోగులపై వేటు వేసింది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 10 వేల మందిని తొలగించింది. పెద్ద కంపెనీల పరిస్థితే ఇలా ఉంటే.. చిన్న కంపెనీల పరిస్థితి మరీ ఘోరంగా ఉన్నది.
ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు కంపెనీలు దారులు వెతుకుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండగా, మరికొన్ని కంపెనీలు కొత్తగా నియామకాలను నిలిపివేస్తున్నాయి. అలాగే ఉద్యోగులకు ఇస్తున్న బోనస్లు, ఇతర ప్రయోజనాలకూ కోత పెడుతున్నాయి.
టెక్ కంపెనీల్లో కొనసాగుతున్న మూకుమ్మడి ఉద్యోగాల తొలగింపు ట్రెండ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పరిశ్రమకు కూడా పాకింది. ఈ ఏడాది అక్టోబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ పరిశ్రమలో దాదాపు 3వేల మంది ఉద్యోగాలు కోల్పో గా.. రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉన్నదని యాక్సియోస్ పేర్కొన్నది. ప్రపంచ ఆర్థిక మందగమనం నేపథ్యంలో ప్రకటనదారులు తమ వ్యయాన్ని తగ్గించుకోవడంతో ఉద్యోగాలపై కోత పడుతున్నదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వార్నర్ బ్రోస్ డిస్కవరీలో తొలగింపులను కొనసాగించింది. వచ్చే నెల ప్రారంభంలో మరిన్ని తొలగింపులు ఉంటాయని సీఎన్ఎన్ మీడియా సంస్థ చీఫ్ క్రిస్ లిచ్ట్ గతవారం పేర్కొన్నారు. పారామౌంట్ గ్లోబల్ నుంచి వాల్ట్ డిస్నీ కంపెనీ వరకు మీడియా సంస్థలు తొలగింపులను ప్రకటించడంతోపాటు ఇతర వ్యయ తగ్గింపు చర్యలు చేపట్టాయి. కామ్కాస్ట్ టెలీకమ్యూనికేషన్ కంపెనీకి చెందిన ఎన్బీసీ యూనివర్సిల్లో కూడా ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉన్నదని నివేదికలు చెబుతున్నాయి. కరోనా నేపథ్యంలో న్యూస్పేపర్ పరిశ్రమ అధిక డిస్ట్రిబ్యూషన్, లేబర్ ఖర్చులను ఎదుర్కొంటున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. యూఎస్ఏ టుడే కంపెనీ మాతృ సంస్థ గన్నెట్ ఆగస్టులో 400 మందిని తొలగించిన తర్వాత మరో దఫా తొలగింపులు చేపట్టే ప్లాన్లో ఉన్నదని నివేదిక పేర్కొన్నది.