NSSO | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు.. మండిపోతున్న ఇంధన రేట్లు.. దేశ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో నెలవారీ కుటుంబ ఖర్చు రెట్టింపు కంటే ఎక్కవగా పెరిగిపోయింది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ (ఎన్ఎస్ఎస్వో) తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. కుటుంబ వినియోగ వ్యయ సర్వే (హెచ్సీఈఎస్) పేరిట నిర్వహించిన ఈ సర్వేలో పట్టణాలు, గ్రామాల వారీగా వివిధ సామాజిక-ఆర్థిక వర్గాల కుటుంబాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయాన్ని(ఎంపీసీఈ) అంచనావేశారు. 2022, ఆగస్టు నుంచి, 2023, జూలై మధ్యలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్ఎస్ఎస్వో ఈ సర్వే చేపట్టిందని శనివారం ఓ అధికారిక ప్రకటన పేర్కొన్నది. అన్ని రాష్ర్టాలు, యూటీల్లో మొత్తంగా 2,61,746 కుటుంబాల నుంచి సేకరించిన సమాచారం అధారంగా ఎన్ఎస్ఎస్వో ఈ అంచనాలను రూపొందించింది. దేశ ప్రజలు ఆహారం కంటే దుస్తులు, వినోదంపైనే అధికంగా వెచ్చిస్తున్నట్టు ఈ సర్వేలో వెల్లడైంది.