న్యూఢిల్లీ: దేశంలో ఉన్న మొత్తం వ్యవసాయ భూముల్లో సగం నైరుతి రుతుపవనాల మీదే ఆధారపడతాయన్న సంగతి తెలుసు కదా. ప్రతి ఏటా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కురిసే వర్షాలే ఈ పంటలకు ఆధారం. అందుకే మన దేశంలో ఈ రుతుపవనాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ఒక రోజు ముందుగానే అంటే మే 31 (ఆదివారం)నే కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ సంస్థ ఆదివారం వెల్లడించింది. సోమవారం రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడనున్నట్లు అంచనా వేసింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు కానున్నట్లు గత నెలలోనే వాతావరణ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే.