Mohamed Muizzu : భారత్, మాల్దీవుల మధ్య కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ద్వీపదేశమైన మాల్దీవ్స్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తమ దేశంలో ఉన్న సైనికులను ఉపసంహరించుకోవాలని భారత్ను కోరింది. భారత వ్యతిరేక ధోరణితో పదవికి వచ్చిన అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు.. భారత సైనికులు వెళ్లిపోవాలని కోరుతున్నారు.
భారత్ మార్చి 15 లోగా తమ దేశం నుంచి సైనికులను ఉపసంహరించుకోవాలని అంటున్నారు. చైనాతో సంబంధాల కోసం మొగ్గు చూపుతున్న ముయిజ్జు.. భారత వ్యతిరేఖ వైఖరి ప్రదర్శిస్తున్నారు. ముయిజ్జు చైనా పర్యటనకు వెళ్లొచ్చిన మూడు రోజుల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. నాడు ముయిజ్జు ఎన్నికల ప్రచారం కూడా ‘ఇండియా అవుట్’ నినాదంతో సాగింది.
తమ దేశ సార్వభౌమాధికారం కోసం కట్టుబడి ఉన్నామంటూ ప్రకటనలు చేస్తున్న ప్రస్తుత మాల్దీవ్స్ ప్రభుత్వం.. చైనాతో అంటకాగుతున్నది. ఇదిలావుంటే ఇటీవల లక్షద్వీప్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీపై ఆ దేశ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. దాంతో ముగ్గురు మంత్రులను అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఈ క్రమంలో భారత్లో ‘బాయ్కాట్ మాల్దీవ్స్’ అంటూ సోషల్ మీడియా పోస్టులు పెల్లుబికాయి. ఇండియన్ టూరిస్టులు మాల్దీవ్స్ హోటల్ బుకింగ్స్, ఫ్లైట్ టికెట్స్ రద్దు చేసుకున్నారు. ఇదిలావుంటే చైనా పర్యటన నుంచి వచ్చిన మాల్దీవ్స్ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు.. తమను వేధించే హక్కు ఏ దేశానికి లేదని, తాము ఎవరికి బ్యాక్ యార్డ్ కాదని భారత్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాము చిన్నవాళ్లమైనా తమను బెదిరించే లైసెన్స్ ఏ దేశానికి లేదని అన్నారు.