న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వ దవాఖానలతో పాటు ఆప్ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మొహల్లా క్లినిక్లపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) దర్యాప్తునకు ఆదేశించింది. నాసిరకం మందుల సరఫరా, నకిలీ పరీక్షలు నిర్వహించినట్టు వచ్చిన ఆరోపణలపై ఈ మేరకు చర్యలు చేపట్టింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చేసిన సిఫారసుల మేరకు ఈ ఆదేశాలు జారీచేసింది. ఈ మందులు నాణ్యతా ప్రమాణాల పరీక్షలో విఫలమైనట్లు సక్సేనా తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం నడుపుతున్న దవాఖానల్లో రోగులకు వీటిని అందజేయడం వల్ల వారి ప్రాణాలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఈ మందులపై దర్యాప్తు జరిపించాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ కూడా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.
దేశ రాజధాని నగరంలోని ప్రపంచ స్థాయి ఆరోగ్య వ్యవస్థను ధ్వంసం చేయాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఢిల్లీ మంత్రి, ఆప్ నేత ఆతిశీ శుక్రవారం ఆరోపించారు. మొహల్లా క్లినిక్లు అవినీతిరహితమని, వీటిని కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి రోగికీ మందులను ఉచితంగా ఇస్తున్నామన్నారు. తప్పుడు ఆరోపణలతో, బూటకపు దర్యాప్తులకు ఆదేశిస్తున్నారని కేంద్రాన్ని దుయ్యబట్టారు. తమను పని చేయకుండా నిలువరించేందుకే బీజేపీ ఈ కుట్రలు పన్నుతున్నదని మండిపడ్డారు.