Modi Road Show | ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగింట బీజేపీ విజయంతో ప్రధాని నరేంద్రమోదీలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరునాడే సొంత రాష్ట్రం గుజరాత్లో ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల పర్యటన కోసం శుక్రవారం గుజరాత్కు వచ్చారు. గాంధీనగర్లోని ఎయిర్పోర్ట్ నుంచి బీజేపీ ఆఫీస్ కమలం వరకు ప్రధాని మోదీ తొమ్మిది కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించారు. తొలిసారి కాషాయ టోపీ ధరించి ప్రధాని మోదీ రోడ్ షోలో పాల్గొన్నారు.
ఈ సమావేశానికి హాజరైన బీజేపీ కార్యకర్తలు కూడా కాషాయ టోపీలు ధరించారు. ఈ టోపీలపై గుజరాతీలో కమల్ అండ్ బీజేపీ అని రాసి ఉంది. రోడ్షో నిర్వహించిన రూట్ పొడవునా, రోడ్డుకిరువైపులా 50 ప్లాట్ఫామ్స్ నిర్మించారు. సుమారు నాలుగు లక్షల మంది ప్రజలను సమీకరించారు. గుజరాత్కు నరేంద్రమోదీ సీఎంగా పని చేసిన సంగతి తెలిసిందే. కమలం ఆఫీసులో సాయంత్రం సర్పంచ్ల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు.
ఈ సదస్సుకు 1.50 లక్షల మంది హాజరవుతారని అంచనా. కరోనా మహమ్మారి తర్వాత గుజరాత్లో ప్రధాని మోదీ అతిపెద్ద సభకు హాజరు కావడం ఇదే తొలిసారి కానున్నది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం తర్వాత గుజరాత్కు వచ్చిన ప్రధాని మోదీని చూసేందుకు రాష్ట్ర బీజేపీ కార్యకర్తల్లో ఆసక్తి నెలకొంది.
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో గాంధీనగర్లోని కమలం ఆఫీసులో భద్రతా ఏర్పాట్లను రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వీ సమీక్షించారు. డీజీపీ ఆశీశ్ భాటియా, గాంధీనగర్ ఎస్పీ మయూర్ చావ్డా, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.