హైదరాబాద్: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది నుంచి తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. అన్నదాతలు చేపట్టిన ఆందోళనలతో దేశమంతా అట్టుడుకుపోయింది. ఈ నేపథ్యంలో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఆ చట్టాలను రద్దు చేసింది. స్వయంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. సాగు చట్టాలను పార్లమెంట్ సమావేశాల్లో రద్దు చేయనున్నట్లు ప్రకటించారు. దీనిపై అంతర్జాతీయ మీడియా సంస్థలు రియాక్ట్ అయ్యాయి. ఇవాళ బీబీసీ ఈ కథనాన్ని తన ప్రధాన శీర్షికగా ప్రచురించింది. వాస్తవానికి రైతుల ఆందోళనలు ప్రపంచదృష్టిని ఆకర్షించాయి. అన్నదాతల ఆక్రందనలకు మోదీ సర్కార్ దిగివచ్చినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. కానీ వివాదాస్పద సాగు చట్టాల రద్దు వ్యూహాత్మకమైన నిర్ణయమని బీబీసీ అభిప్రాయపడింది. ఇదొక రాజకీయ ఎత్తుగడ అని కూడా ఆ కథనం చెప్పుకొచ్చింది. చాలా ఆలస్యంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తన కథనంలో పేర్కొన్నది.
కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, యూపీలో ఆందోళనలు మిన్నంటాయి. ఇది నిజంగా ప్రధాని మోదీకి ఓ ఛాలెంజ్గా మారింది. పంజాబ్లోని సిక్కు రైతులు కేంద్ర సర్కార్పై కన్నెర్ర చేశారు. యావత్ సమాజం వారితో కలిసేలా సిక్కు రైతులు అడుగులు వేసినట్లు బీబీసీ అభిప్రాయపడింది. రైతు చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన సిక్కుల ధర్నాలు ఉత్తరప్రదేశ్కు వ్యాపించాయి. అక్కడ కూడా మెల్లమెల్లగా అగ్గి రాజుకున్నది. క్రమంగా ఆ రెండు రాష్ట్రాల్లో రైతు నిరసనలు ఉప్పెనలా మారాయి. నిజానికి ఈ రెండు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ ప్రభుత్వం అకస్మాత్తుగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
రైతు సంక్షేమం కోసమే నూతన చట్టాలను రూపొందించినట్లు ముందు నుంచీ కేంద్రం చెప్పుకొచ్చింది. కానీ పంజాబీ సిక్కుల నుంచి అనూహ్య రీతిలో స్పందన రావడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేసింది. సిక్కుల మనోభావాలను మళ్లీ ఆకర్షించేందుకు మోదీ సర్కారు విశ్వప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్లో ఉన్న కార్తార్పూర్ పవిత్ర సిక్కు క్షేత్రానికి దారుల్ని ఓపెన్ చేసింది. అయినా రైతు చట్టాలకు వ్యతిరేకంగా రోజు రోజుకూ సిక్కులు తమ విధానాన్ని బలపరుచుకుంటూ వెళ్లారు. ఎక్కడా తగ్గేదిలేదన్నారు. ఎన్నిసార్లు చర్చలు చేసినా తమ అభిప్రాయాల్ని మార్చుకోలేదు. ప్రభుత్వం పంతంమీదున్నా.. అంతకన్నా ఎక్కువ పట్టుదలతో సిక్కు రైతులు ఉద్యమించారు. పంజాబ్.. వ్యూహాత్మకంగా సరిహద్దు రాష్ట్రం. అయితే గత చరిత్రను పరిశీలిస్తే, అక్కడ ఇలాంటి ఉత్పాతాలు గతంలోనూ చోటుచేసుకున్నాయి. 1980 దశకంలో వేర్పాటువాద ఉద్యమం అక్కడ తీవ్ర హింసను సృష్టించింది.
ఇవాళ వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసిన మోదీ.. అన్నదాతల విశ్వాసాన్ని గెలిచేందుకు మళ్లీ ప్రయత్నిస్తారని బీబీసీ అభిప్రాయపడింది. ముఖ్యంగా సిక్కుల అభిమానాన్ని గెలుచుకోవాలన్న తపన ఆయనలో ఉన్నట్లు అర్థమైందని పేర్కొన్నది. సాగు చట్టాల రద్దు ఒకరకంగా రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయ అవకాశాలను మెరుగుపరుస్తుందని ఆ కథనంలో అభిప్రాయపడింది. మార్కెట్ ధరకే తమ పంటను ఎక్కడైనా అమ్మవచ్చు అన్న చట్ట సవరణ పంజాబీలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. కొత్త చట్టాల వల్ల మండీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని, ప్రైవేటు వారికి నేరుగా తమ పంటను అమ్మితే.. వాళ్లే ధరలను నియంత్రిస్తారని రైతులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే.