ITR | 2023-24 ఆర్థిక సంవత్సరానికి (2024-25 మదింపు సంవత్సరం)గాను ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్స్ను దాఖలు చేస్తున్న ట్యాక్స్పేయర్స్కు సూచన. పాత పన్ను విధానాన్ని ఎంచుకునేవారు జూలై 31లోగా ఐటీఆర్లను దాఖలు చేయాలి. లేకపోతే పాత పన్ను విధానం ఐటీ ప్రయోజనాలు రావు. ఆగస్టు 1 నుంచి దాఖలయ్యే ఐటీఆర్లు కొత్త పన్ను విధానానికి లోబడే ఉంటాయి. ఈ ఏప్రిల్ 1 నుంచే 2024-25 మదింపు సంవత్సరం కోసం ఐటీఆర్ల దాఖలు మొదలైంది. దీంతో ఈ ఏడాది జూలై 31లోగా జరిమానా లేకుండా ఐటీ రిటర్నులను దాఖలు చేసేవారికే పాత పన్ను ప్రయోజనాలు అందుతాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్తున్నది. ఆ తర్వాత మీ ఐటీఆర్లు డీఫాల్ట్గా కొత్త పన్ను విధానంలోకే వెళ్తాయంటున్నారు.
ఆదాయ పన్ను చట్టం ప్రకారం కొత్త పన్ను విధానం డీఫాల్ట్. అంటే ట్యాక్స్పేయర్కు ఇప్పటికే ఇది వర్తిస్తున్నదన్నమాట. ఒకవేళ ఉద్యోగులు పాత పన్ను విధానాన్ని కోరుకుంటే కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే ఆ విషయాన్ని తమ సంస్థకు తెలియజేయాలి. ఒకవేళ అలా చేయకుంటే సదరు ఉద్యోగి ఆటోమేటిగ్గా కొత్త పన్ను విధానం కిందకే వస్తాడు. దీంతో కొత్త పన్ను శ్లాబుల్లోని రేట్ల ప్రకారమే పన్ను కోతలు, మినహాయింపులుంటాయి. అయినప్పటికీ గడువులోగా ఐటీఆర్ ఫైలింగ్ చేసే ఉద్యోగులకు పాత, కొత్త పన్ను విధానాలను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఏటా వేతన జీవులకు మాత్రమే ఈ వీలున్నది. కానీ వ్యాపారులు, ట్రేడర్లకు ఏడాదికోసారి కాకుండా ఒక్కసారే ఈ అవకాశం వస్తుంది.
పాత పన్ను విధానంలో రూ.2.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు అందుబాటులో ఉన్నాయి. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు, స్టాండర్డ్ డిడక్షన్ కింద రూ.50,000, ఎన్పీఎస్కు రూ.50,000 వరకు మినహాయింపున్నది. అలాగే కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ కింద మాత్రమే రూ.50,000 పన్ను మినహాయింపున్నది.