దేశంలో అధిక భాగం మొఘలాయిల పాలనలో ఉన్న సమయంలో, గోవా పోర్చుగల్ వారి పాలన కిందికి వెళ్లిందని, అది గడచి, ఇన్ని సంవత్సరాలైనా.. గోవా భారతీయతను మరిచిపోలేదని, గోవాను భారతీయులు మరిచిపోలేదని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. గోవా లిబరేషన్ డే ఉత్సవాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం గోవాలో పర్యటించారు. అక్కడ జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గోవా విముక్తి కోసం పోరాడిన వారిని సన్మానించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ… గతంలో తాను ఇటలీ, వాటికన్ సిటీ పర్యటనకు వెళ్లినప్పుడు పోప్ను కలిసే సందర్భం వచ్చిందని, అప్పుడు భారత్లో పర్యటించాలని ఆయన్ను ఆహ్వానించానని పేర్కొన్నారు. దీనికి పోప్ సమాధానమిస్తూ… ఓ అద్భుతమైన గిఫ్ట్ను నాకు బహూకరించారని పోప్ అన్నారని మోదీ తెలిపారు. ”చాలా రోజుల క్రితం నేను ఇటలీ, వాటికన్ సిటీ పర్యటనకు వెళ్లా. పోప్ను కలుసుకున్నా. భారత్లో పర్యటించాలని ఆహ్వానించా. అప్పుడు పోప్ స్పందిస్తూ… మీరు నాకిచ్చిన అద్భుతమైన గిఫ్ట్ ఇదే. మన దేశ ప్రజాస్వామ్యం, వైవిధ్యత విషయంలో పోప్కున్న అపారమైన ఆదరణ ఇది” అని మోదీ పేర్కొన్నారు. గుడ్ గవర్నెన్స్తో పాటు ఇతర అంశాల్లో గోవా ప్రగతి చాలా బాగుందని ప్రధాని ప్రశంసించారు. గోవా ప్రజలు శాంతియుతంగానే మెలుగుతున్నారని, క్వీన్ కెతావన్ అవశేషాన్ని చాలా సంవత్సరాల పాటు భద్రపరిచారని, గోవా ప్రజలను ఎంత ప్రశంసించినా తక్కువేనని మోదీ పేర్కొన్నారు.