న్యూఢిల్లీ, జనవరి 14: ఉత్తరప్రదేశ్తోపాటు మరో నాలుగు రాష్ర్టాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు మోదీ-షా ద్వయానికి పరీక్షగా మారుతున్నాయి. ఐదింటిలో నాలుగు రాష్ర్టాల్లో బీజేపీయే అధికారంలో ఉన్నది. దేశంలో ఇప్పుడున్న ఆర్థిక, రాజకీయ వాతావరణం ఆ పార్టీకి వ్యతిరేకంగా కనిపిస్తున్నది. యూపీతోపాటు ఎన్నికలు జరుగుతున్న మరో మూడు రాష్ర్టాల్లో తమకు ఆశల్లేవని బీజేపీ నేతలే చెప్తున్నారు. ‘అసలే పంజాబ్లో మా ఉనికి అంతంత మాత్రం. ఇప్పుడు మిత్రపక్ష అకాలీదళ్ దూరమైపోయింది. అమరీందర్సింగ్ ప్రభావమెంతో మొన్నటి ప్రధాని సభ వ్యవహారంతోనే తేలిపోయింది. రైతు చట్టాల కారణంగా ఇప్పుడు పంజాబ్ ఊర్లలోకి మేం ప్రచారానికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఇక గోవాలో నేతలు ఒక్కరొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. అగ్రనేత దివంగత మనోహర్ పరీక్కర్ కుమారుడు ఉత్పల్ పరీక్కర్ తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉత్తరాఖండ్లో ఇప్పటికే ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చాం. అయినా పరిస్థితి ఏమీ మెరుగుపడలేదు’ అని బీజేపీ అగ్రనేతలకు సన్నిహితంగా ఉండే తెలుగు రాష్ర్టాల ముఖ్య నేత ఒకరు పేర్కొన్నారు.
ముంచనున్న ఒంటెత్తు పోకడ
బీజేపీలో అజాత శత్రువు ఆద్వానీ, యూపీ బ్రాహ్మణ, మేధావి వర్గాల్లో మంచి పేరున్న పార్టీ మాజీ అధ్యక్షుడు మురళీమనోహర్జోషీ కూడా మోదీ- ద్వయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ‘ఒకరకంగా చెప్పాలంటే పార్టీలో ఇప్పుడు ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం ఉన్నది. అద్వానీ- వాజ్పేయి అనుయాయులు ఒకవైపు, మోదీ- షా మద్దతుదారులు మరోవైపు మోహరించారు. కష్టకాలంలో పార్టీని నిలబెట్టిన తమకు పార్టీలో ఎలాంటి ప్రాధాన్యమూ ఉండటం లేదని, తమను తొక్కేస్తున్నారని పాతతరం నాయకులు భావిస్తున్నారు’ అని ఒక జర్నలిస్టు తెలిపారు. ‘ఈ మూడు రాష్ర్టాల్లో ఓటమి ఎలాగూ ఖాయంగా కనిపిస్తున్నది. దీంతోపాటు యూపీ కూడా చేజారిపోతే పార్టీకి, దాంతో పాటే ప్రస్తుత నాయకత్వానికి ఇబ్బందులు తప్పవు. ఇదంతా మోదీ- షా స్వయంకృతం. గత ఏడెనిమిదేండ్లుగా వాళ్లు చాలా అతి చేశారు. ఆద్వాణీ, జోషీ లాంటి వాళ్లను పక్కనబెట్టడాన్ని పార్టీ కార్యకర్తలు, పాత తరం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. విదేశాంగ విధానంలోనూ మేం విఫలమయ్యాం. దేశీయంగా ఈ ఏడేండ్లలో ఇంటా బయటా, పార్టీలో, వెలుపలా అనేకమందిని శత్రువులను చేసుకున్నాం. మిత్రుల్ని పోగొట్టుకున్నాం. సొంత పార్టీలో నేతలను ఎదగకుండా అణగదొక్కాం.
ఎదురొస్తారనుకున్న ప్రతి నేతనూ, చివరికి ఒక దశలో యోగిని కూడా తొక్కేయడానికి మోదీ- షా ప్రయత్నించారు. అయితే ఆరెస్సెస్ అండ ఉండటంతో ఆయన బతికిపోయారు. ఇద్దరి ఆధిపత్య ధోరణికి ఇప్పుడు పార్టీ మూల్యం చెల్లించుకోబోతున్నది’ అని తెలుగు రాష్ర్టాల నేత ఆవేదన వ్యక్తంచేశారు. యూపీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి వ్యతిరేకంగా వస్తే మోదీ-షా డౌన్ట్రెండ్ తప్పదని అభిప్రాయపడుతున్నారు. బీఎంఎస్, వీహెచ్పీ, స్వదేశీ జాగరణ్మంచ్ వంటి అనేక సంఘ్పరివార్ సంస్థలు కూడా ఇద్దరు అగ్ర నేతలపై కత్తులు నూరుతున్నాయని, తగిన సమయం కోసం వేచి చూస్తున్నాయని పరివార్కు చెందిన నాయకుడొకరు అంగీకరించారు. యూపీ ఎన్నికల ఫలితాల ప్రకటనే ఆ సమయమా? చూడాలి!