న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆయనో నియంత అన్న విమర్శలను ఖండించారు. తనకు తెలిసిన గొప్ప ప్రజాస్వామ్య నేతల్లో మోదీ ఒకరని షా అన్నారు. నేను మోదీతో కలిసి ప్రతిపక్షంలో, అధికారంలో పని చేశాను. ఆయనలాంటి శ్రోతను నేను చూడలేదు. ఏ అంశంపై సమావేశమైనా మోదీ చాలా తక్కువ మాట్లాడతారు. అందరూ మాట్లాడింది చాలా ఓపిగ్గా వింటారు. ఓ వ్యక్తి అభిప్రాయానికి ఉండే విలువను మోదీ పరిగణనలోకి తీసుకుంటారు. అంతే తప్ప ఆ వ్యక్తికి ప్రాముఖ్యత ఇవ్వరు. అందుకే ఆయనో నియంత అన్న విమర్శల్లో ఏమాత్రం నిజం లేదు అని సన్సద్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా అన్నారు.
ప్రజా సేవలో మోదీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పాలన తీరును షా మెచ్చుకున్నారు. ఆయనపై లేనిపోని ఆరోపణలు చేసి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేబినెట్ను మోదీ చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో నడిపిస్తారు. మోదీయే అన్ని నిర్ణయాలు తీసుకుంటారన్న భావన సరికాదు. ప్రతి అంశాన్ని ఆయన చర్చిస్తారు. అందరు చెప్పింది వింటారు. మంచి చెడులను బేరీజే వేస్తారు. ప్రధానమంత్రి కాబట్టి ఎలాగూ తుది నిర్ణయం మాత్రం ఆయనదే అని అమిత్ షా చెప్పారు.