PM Modi | హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఈ ఉదాహరణలు చాలు బీసీలపై బీజేపీకి ఉన్న ప్రేమ తెలియడానికి. తాను బీసీ ప్ర ధానినని మోదీ చెప్పుకోవడానికే తప్ప.. బీసీలకు చేసిందేమీలేదని దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రధాని మోదీ నిర్ణయాలు, బీజేపీ చర్యలు దీనికి సా క్ష్యంగా నిలుస్తున్నాయి. బీసీ కులగణనపై బీ జేపీ అధికారంలోకి రాకముందు ఒక మాట మాట్లాడి, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది.
బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు..
2010లో బీజేపీ ఎంపీ గోపీనాథ్ ముండే పార్లమెంట్లో మాట్లాడుతూ.. ‘2011 జనాభా లెక్కల్లో బీసీ కులగణన చేయకపోతే వారికి సామాజిక న్యాయం చేయడం సాధ్యం కాదు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు అన్యాయం చేయడమే’ అని పేర్కొన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత..
ఇదే సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచీ బీసీ కులగణన చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నది. 2021లో అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఒక్క తెలంగాణ మాత్రమే కాదు బీహార్, మ హారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్ తదితర రాష్ర్టాలు కులగణన తీర్మానాలు చేశాయి. దేశవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు వందలు, వేల వినతులు ఇచ్చాయి. డిమాండ్లు చేసినా, ధర్నాలు చేసినా పట్టించుకోలేదు. బీసీల కుల గణన జరుగక సామాజికంగా వెనుకబడిన తరగతులను గుర్తించడం సాధ్యం కావడం లేదని, వారికి విద్య, ఉద్యోగ రంగాల్లో అన్యా యం జరుగుతున్నదని నిపుణులు మొత్తుకొంటున్నారు.
అయినా పట్టింపులేదు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించినా.. కుల జనాభా వివరాలు లేక లాటరీ పద్ధతిలో బీసీ స్థానాలు కేటాయిస్తున్నారని, దీంతో ఎక్కువ జనాభా ఉన్న కులాలకు అన్యాయం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నా వినిపించుకోవడం లేదు. బీసీ కులాల లెకలు లేకపోవడం వల్ల జనాభా ప్రకారం రిజర్వేషన్లు లేవని, సబ్ప్లాన్ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రధాని చెవికి చేరడం లేదు. బీసీ జాబితాలోని కులాల సంఖ్యలో మార్పులు, చేర్పులు చేయాలన్నా కులగణనే ప్రాతిపదిక అని స్పష్టం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. బీసీ ఆత్మగౌరవ సభ అంటూ బుధవారానికి రాష్ర్టానికి వస్తున్న ప్రధాని మోదీ ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన చేస్తారా? అని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
బీసీలకు మంత్రిత్వ శాఖ ఏది?
దేశ జనాభాలో దాదాపు 56 శాతంగా.. అంటే 70 కోట్ల బీసీ జనాభా ఉన్నదని, కేంద్రంలో ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తొలి శాసనసభ సమావేశాల్లోనే ‘బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి’ అని 2014 జూన్ 14న రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీనిని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. తర్వాత లేఖలు, డిమాండ్లు, పార్లమెంట్ వేదికగా.. ఇలా వివిధ రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. అయినా ఇప్పటివరకు కేంద్రం పట్టించుకోవడం లేదు. మోదీ వచ్చి బీసీ మంత్రిత్వ శాఖపై ప్రకటన చేసే అవకాశం ఉన్నదంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సోమవారం పేర్కొన్నారు. దీనిని బట్టి ఎన్నికలు వస్తే తప్ప బీసీలు గుర్తుకు రారా? అని బీసీ సంఘాలు మండిపడుతున్నాయి.