న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: రాష్ట్రాలు వద్దంటున్నా, రైతులు మొత్తుకొంటున్నా కేంద్రంలోని మోదీ సర్కారు మరోసారి రైతు వ్యతిరేక నిర్ణయం తీసుకొన్నది. ధాన్యం సేకరణను ప్రైవేటీకరిస్తామని ప్రకటించింది. ఇప్పటికే కొనేవాళ్లు లేక, కనీస మద్దతు ధర దక్కక అన్నదాత అల్లాడుతుంటే.. సేకరణ బాధ్యతను వదిలించుకోవడానికి సిద్ధమైంది. సోమవారం రోలర్ఫ్లోర్ మిల్లర్ ఫెడరేషన్ 82వ వార్షిక సమావేశంలో కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ కార్యదర్శి సుధాంశు పాం డే మాట్లాడుతూ.. ‘పంట సేకరణలో ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానించాలని నిర్ణయించాం. అదీ వచ్చే సీజన్ నుంచే. పంటను ఎఫ్సీఐ, రాష్ట్ర ఏజెన్సీలే ఎందుకు సేకరించాలి? ప్రైవేట్ సంస్థలైతే తక్కువ రే టుకే, ఎక్కువ నాణ్యత ఉన్న పంటలను సేకరిస్తాయి. ప్రస్తు తం ఉన్న ఏజెన్సీల కన్నా త క్కువ రేటుకే ప్రైవేట్ సంస్థలు పంట సేకరణ చేపడితే కేంద్రానికి ఎలాంటి ఇబ్బందీ లేదు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ కూడా రాశాం’ అని పేర్కొన్నారు.
పంట సేకరణ నిర్ణయంపై వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న మద్దతు ధర.. పూర్తిగా లేకుండా పోతుందని చెప్తున్నారు. పంట కొనుగోళ్ల నుంచి తప్పుకోవటం అంటే.. రైతులకు మద్దతు ధర దక్కినా, దక్కకపోయినా తమకు సంబంధం లేదు అని కేంద్రం చేతులెత్తేసినట్టేనని పేర్కొంటున్నారు. ప్రస్తుతం పంటలకు అంతంత మాత్రంగానే కనీస మద్దతు ధర దక్కుతున్నది. అది కూడా వరి, గోధుమలకే. ఇప్పుడు పంట కొనుగోళ్లను ప్రైవేట్కు అప్పగిస్తే మద్దతు ధర దక్కటం కష్టమే. కార్పొరేట్ శక్తుల చేతుల్లో రైతన్న కీలుబొమ్మగా మారి సర్వస్వాన్ని కోల్పోవాల్సిన దుస్థితి వస్తుంది. ఇప్పటికే, దేశంలో అనేక రంగాలను ప్రైవేటీకరణ చేసిన మోదీ సర్కారు.. ఇప్పుడు వ్యవసాయాన్ని కూడా అదే దృష్టితో చూస్తున్నది. దేశ అవసరాలు, ఎగుమతుల కోసం ఉపయోగించాల్సిన ఆహార ఉత్పత్తులను వ్యాపార వనరుగా మార్చేస్తున్నది. అటు.. రాష్ర్టాలు సేకరించే ఆహార ధాన్యాల యాధృచ్చిక ఖర్చులు 2 శాతమే భరిస్తామని పేర్కొన్నది.
రైతులను నట్టేట ముంచే యత్నాలు
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు.. ఇప్పుడు వాళ్లను నట్టేట ముంచే ప్రయత్నాలు చేస్తున్నదని వ్యవసాయ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట సేకరణ బాధ్యతలు ప్రైవేట్ వాళ్లకు అప్పగిస్తే రైతులను నిలువు దోపిడీ చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ‘నీ పంటకు ఇంతే ఇవ్వగలం. ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేం. కాదూ కూడదు అంటే వెళ్లిపో’ అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారని తెలిపారు. ఇప్పటికే 3 వ్యవసాయ చట్టాలతో వ్యవసాయాన్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టే ప్రయత్నం చేసిందని, అది వీలుకాక ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేస్తున్నదని మండిపడుతున్నారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకొన్నప్పుడు జాతికి క్షమాపణ చెప్పిన మోదీ.. మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఆ హామీని కూడా కేంద్రం తుంగలో తొక్కుతున్నది.
ఎప్పటినుంచో ప్రయత్నాలు
పంట కొనుగోళ్ల నుంచి తప్పించుకోవటానికి కేంద్రం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే గత యాసంగిలో తెలంగాణ సహా పలు రాష్ర్టాల పంటలను కొనేందుకు విముఖత చూపింది. ఎన్నో ఇబ్బందులు పెట్టింది. ఇప్పుడు మొత్తానికే పంట సేకరణ బాధ్యతల నుంచి తప్పించుకొనేందుకు సిద్ధమైంది.
ఆహార నిల్వలు పడిపోతున్నా..
కేంద్రం ఆంక్షలతో, కరువుతో సాగు విస్తీర్ణం తగ్గి ఆహార నిల్వలపై భారీ ప్రభావం పడుతున్నది. దేశంలో బఫర్ స్టాక్ కరిగిపోతున్నది. ఈసారి గత ఏడాది కంటే 25 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. ఈ సీజన్లో 50 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి తగ్గే అవకాశం ఉన్నదని కేంద్రమే స్వయంగా చెప్పింది. యాసంగిలో వరి, గోధుమల సాగు మరింత తగ్గే అవకాశం ఉన్నది. ఇలాంటి సమయాల్లో పంటల కొనుగోళ్ల బాధ్యతలను ప్రైవేట్ చేతికి అప్పగిస్తే పరిస్థితి దారుణంగా తయారయ్యే ప్రమాదం ఉన్నది. కరువు ముంచుకొస్తే సాయం అందించటానికి ప్రైవేట్ సంస్థలు ముందుకురావు. ఆశ్చర్యకరంగా.. కేంద్రం గోధుమల ఎగు మతులపై నిషేధం విధించిన తర్వాతే అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ రెండో అతిపెద్ద ఎగుమతి దారుగా అవతరించటం గమనార్హం.
ముందే చెప్పిన సీఎం కేసీఆర్
పంట కొనుగోళ్ల నుంచి ఎఫ్సీఐ తప్పించుకొనే ప్రమాదం ఉన్నదని, వ్యవసాయాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని సీఎం కేసీఆర్ ఎప్పటినుంచో చెప్తూ వస్తున్నారు. మొన్నకిమొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘ఇప్పటికే ఓడరేవులు, విమానాలు అన్నీ పాయే.. రైలు పాయే, రైల్వే స్టేషన్లు పాయే.. ఇక రెండు మిగిలాయ్. ఒకటి వ్యవసాయం, రెండోది విద్యుత్తు రంగం. ఈ రెండు సావుకార్లకు అప్పజెప్పే వరకు నిద్రపోం.. ఇదీ కేంద్రం శపథం’ అని పేర్కొన్నారు. ఎఫ్సీఐని పూర్తిగా మూసేసే ప్రమాదం ఉన్నదని నమస్తే తెలంగాణలోనూ పలు కథనాలు వచ్చాయి.
2021 డిసెంబర్ 26న నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనం