స్వాతంత్య్రం వచ్చిన తరువాత 2014 వరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు దేశం కోసం చేసిన అప్పు ఎంతో తెలుసా?
అక్షరాలా.. రూ.55,87,149 కోట్లు
ఘనత వహించిన మోదీ సర్కారు అధికారంలోకి
వచ్చినప్పటినుంచి గత ఎనిమిది సంవత్సరాలలో
చేసిన అప్పు ఎంతో తెలుసా?
అక్షరాలా.. రూ.80,00,744 కోట్లు
(కాసాని మహేందర్రెడ్డి)
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పులకుప్పగా మార్చేసింది. గడిచిన 8 ఏండ్లలో ఏటా సగటున రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఫలితంగా 67 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో తీసుకొన్న అప్పులకన్నా 8 ఏండ్ల మోదీ పాలనలో తీసుకొన్న అప్పులే ఎక్కువయ్యాయి. గతంలో పనిచేసిన 13 మంది ప్రధాన మంత్రులకు సాధ్యం కాని స్థాయిలో ఎడాపెడా అప్పులు చేసిన ఘనత నరేంద్రమోదీదేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్పై పన్నులు, సెస్సుల రూపంలో ప్రజల ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ఇలా వచ్చిన డబ్బును ఏం చేస్తున్నారని అడిగితే.. గత ప్రభుత్వాలు చేసిన అప్పులను కడుతున్నామంటూ ‘వాట్సాప్ యూనివర్సిటీ’ ద్వారా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొంటున్నారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పులు చేస్తున్నది కదా! అని లాజిక్ లాగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తాను చేసిన అప్పులతో అద్భుతమైన స్థిరాస్థులను సమకూర్చుకొన్నది.
సంపదను సృష్టించి, ప్రజలకు పంచుతున్నది. అపూర్వ నిర్మాణమైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతోపాటు.. అనేక సాగునీటి ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు వంటివి ఆ అప్పులు ఎలా సద్వినియోగమయ్యాయో.. అనేక తరాలకు ఉపయోగపడే ఆస్తిని ఎలా ఏర్పాటు చేశాయో చెప్పేందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తెలంగాణలో సృష్టించిన సంపద దేశ ఆర్థిక వ్యవస్థకే దన్నుగా మారింది. మరి మోదీ ప్రభుత్వం ఈ ఎనిమిదేండ్లలో చేసిన 80 లక్షల కోట్ల అప్పుతో చేసిన ఘనకార్యాలేంటో బీజేపీ నేతలు చెప్పగలరా? అని పలువురు నిలదీస్తున్నారు. దేశవ్యాప్తంగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు సహా 18 మెగా ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.5 లక్షల కోట్ల అంచనా ఖర్చుతో పునాదిరాళ్లు తమ పేర్లతో వేసుకొన్నారు. వాటికి పెట్టుకొన్న గడువు కూడా తీరిపోయింది. ఒక్క తట్టెడు పని కూడా జరుగలేదు. రూ.80 లక్షల కోట్ల అప్పుల సంగతి దేవుడెరుగు.. ఏటా రూ.3 లక్షల కోట్లు పెట్రో బాదుడుతోనే వసూలు చేస్తున్నారు కదా.. రూ.5 లక్షల కోట్లు ఓ లెక్కా?
అప్పట్లో ఏటా రూ.83 వేల కోట్లు..
ఇప్పుడు నెలకే రూ.83 వేల కోట్లు
ప్రధానిగా నరేంద్రమోదీ 2014లో అధికారంలోకి రాకముందు కేంద్రం చేసిన మొత్తం అప్పు రూ.55.87 లక్షల కోట్లు. అంటే.. స్వాతంత్య్రం అనంతరం 67 ఏండ్లలో ప్రభుత్వాలు ఏటా సగటున రూ.83,388 కోట్లు అప్పు చేశాయన్నమాట. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పులు రూ.135.87 లక్షల కోట్లు. అంటే మోదీ తన ఎనిమిదేండ్ల పాలనలో రూ.80 లక్షల కోట్లు అదనంగా అప్పులు చేశారు. సగటున ఏటా రూ.10 లక్షల కోట్లు అన్నమాట. ఈ లెక్కన ప్రతి నెల మోదీ ప్రభుత్వం తీసుకొన్న సగటు రుణం రూ.83,341 కోట్లు. గతంలో పనిచేసిన 13 మంది ప్రధాన మంత్రులు సగటున ఏటా రూ.83 వేల కోట్లు అప్పులు చేస్తే, మోదీ ఏకంగా నెలకే రూ.83 వేల కోట్లు రుణం తీసుకొన్నారు. ఈ ఏడాది మరో 17 లక్షల కోట్ల అప్పు తీసుకోవడానికి మోదీ సర్కారు ప్లాన్ చేసింది. దీంతో లక్షన్నర లక్షల కోట్లకు మన అప్పు చేరుతుంది. భారత్ అప్పుల్లో కనీవినీ ఎరుగని భారీ రికార్డు సృష్టించబోతున్నదన్నమాట!
పెట్రో బాదుడు.. నాలుగు రెట్లు
దారుణంగా అప్పులు చేస్తున్నది కదా.. కనీసం ప్రజలకు పన్నుల్లో ఉపశమనం కలిగిస్తుందా అంటే అదీ లేదు. దేనికదే లెక్క అన్నట్టు మోదీ సర్కారు వ్యవహరిస్తున్నది. ప్రజలపై పన్నుల భారం మోపడంలోనూ బీజేపీ ప్రభుత్వానిదే రికార్డు. పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోని ప్రతి ఒక్కరితో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒక్క రూపాయి ధర పెరిగినా.. సామాన్యుడిపై కనీసం రెండు రూపాయల భారం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై పన్నుల భారం మోపింది. మోదీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 2014-15లో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్పై పన్నుల రూపంలో కేంద్ర ఖజానాకు రూ.74,158 కోట్లు చేరాయి. 2020-21కి వచ్చేనాటికి ఈ మొత్తం ఏటా రూ.3 లక్షల కోట్లకు చేరింది. మొత్తంగా ఈ ఏడేండ్లలో రూ.16.7 లక్షల కోట్లు వసూలు చేసింది. అంటే ఏటా సగటున రూ.2.38 లక్షల కోట్లను ప్రజల జేబుల నుంచి గుంజుకొన్నది. 2014లో కేంద్రానికి వచ్చిన ఆదాయంలో పెట్రోల్, డీజిల్పై వచ్చిన పన్నుల వాటా 5.4 శాతంగా ఉండగా, 2020-21 నాటికి అది 12.2 శాతానికి పెరింగింది. నేడు ఒక్క వంటగ్యాస్ సిలిండర్కు పెడుతున్న ఖర్చుతో మోదీ మొదటిసారి ప్రధాని అయినప్పుడు రెండు సిలిండర్లు వచ్చేవంటే రేట్లు ఏ స్థాయిలో పెంచారో అర్థం చేసుకోవచ్చు.
అప్పులు కడుతున్నామంటూ దుష్ప్రచారం..
చమురు ధరల పెంపుతో కేంద్రం ఏటా రూ.3 లక్షల కోట్లను తమ జేబుల నుంచి గుంజుకొంటున్న విషయం ప్రజలకు క్రమంగా అర్థమవుతున్నది. దీంతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండటంతో ‘వాట్సప్ యూనివర్సిటీ’ కొత్త ప్రచారం మొదలుపెట్టింది. ప్రస్తుతం పెంచిన పన్నులతో వచ్చిన డబ్బును గత పాలకులు చేసిన అప్పులు తీర్చేందుకు వాడుతున్నామంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నది. ఈ నకిలీ వార్తను దేశవ్యాప్తంగా గ్రామగ్రామానికి చేరేలా బీజేపీ ప్రచారం ముమ్మరం చేసింది. నిజానికి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పటివరకు పేదలపై చమురు ధరల భారం పడకుండా నియంత్రణ ఉండేది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) అంతర్జాతీయ మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన ధర కన్నా తక్కువకు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ అమ్మేవి. ఆ నష్టాన్ని పూడ్చేందుకు కేంద్ర ప్రభుత్వం క్యాష్ సబ్సిడీ కింద ‘పెట్రోలియం బాండ్స్’ను విడుదల చేసేది. వీటిని వెంటనే డబ్బుగా మార్చుకోవచ్చు. లేదా నిర్ణీత కాలం వరకు వేచిచూస్తే వడ్డీతో సహా చెల్లించేలా కేంద్రం ఒప్పందం చేసుకొన్నది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆరేండ్లలో రూ.1.30 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉండింది. అంటే.. ఏటా సగటున రూ.22 వేల కోట్లు. ఈ చెల్లింపులను 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించింది. నిరుడు కేంద్రం ఆయిల్ బాండ్స్కు చెల్లించింది కేవలం రూ.20 వేల కోట్లు. కానీ.. మోదీ ప్రభుత్వం ఈ అప్పును సాకుగా చూపి ప్రజల నుంచి ఏకంగా రూ.3 లక్షల కోట్లు వసూలు చేస్తున్నది. మిగతా రూ.2.80 వేల కోట్లు ఏమైపోయినట్టు? ‘కేంద్రం పది పైసల అప్పును చూపెట్టి.. పది రూపాయలను జేబులో నుంచి గుంజుకుంటున్నది’ అని ఆర్థిక నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరికొన్ని అప్పుల లెక్కలు