పేదలకు ఉచిత పథకాలను కేంద్రప్రభుత్యం వ్యతిరేకించడాన్ని చూస్తుంటే, కేంద్ర ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేదలపై పన్నుల భారాన్ని మోపుతున్న మోదీ సర్కారు సంపన్నులకు మాత్రం రుణాలను మాఫీ చేస్తున్నది.
-అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం
న్యూఢిల్లీ, ఆగస్టు 11: పేదలకు ఉచిత పథకాలను కేంద్రప్రభుత్యం వ్యతిరేకించడాన్ని చూస్తుంటే, కేంద్ర ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పేదలపై పన్నుల భారాన్ని మోపుతున్న మోదీ సర్కారు సంపన్నులకు మాత్రం రుణాలను మాఫీ చేస్తున్నదని మండిపడ్డారు. ‘కేంద్రపన్నుల్లో రాష్ర్టాల వాటాను 42 శాతం నుంచి 29 శాతానికి తగ్గించారు. ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించారు. పెట్రోల్, డీజిల్ ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ. 3.5 లక్షల కోట్ల ఆదాయం వస్తున్నది. అయినప్పటికీ, ఉచిత విద్య, వైద్యాన్ని కేంద్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సంపన్నులకు రూ. 10 లక్షల కోట్లు, వారి కంపెనీలకు రూ. 5 లక్షల కోట్ల పన్నులను కేంద్రం మాఫీ చేసిందని ఆరోపించారు. సైనికుల ఫించన్లకు డబ్బులు లేవని చెప్పడం స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి ఇదే తొలిసారని విమర్శించారు. కాగా, విద్య, వైద్యం పేరిట ఉచితాల అంశాన్ని కేజ్రీవాల్ తప్పుదోవ పట్టించి ప్రజలను భయపెడుతున్నారని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ఉచిత హామీల అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.