మన భూభాగంలో ఎవరూ చొరబడలేదు. ఒక్క అంగుళం భూమి కూడా ఎవరి స్వాధీనంలోకి వెళ్లలేదు. మన దేశానికి చెందిన ఒక్క ఆర్మీ పోస్టు కూడా చైనా ఆధీనంలోకి వెళ్లలేదు. మన భూభాగంపై ఏ ఒక్కరూ కన్నెత్తి చూడలేరు. ఆ విధంగా త్రివిధ దళాలకు మౌలిక సదుపాయాలను కల్పించాం 2020 జూన్లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలివి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ)
హైదరాబాద్, సెప్టెంబర్ 19: ప్రధాని మాటలన్నీ వట్టి బూటకమేనని తేలిపోయింది. చైనా దురాక్రమణ అంశంలో మోదీ వైఖరిపై నెలకొన్న అనుమానాలే చివరకు నిజమయ్యాయి. గల్వాన్లో 20 మంది మన సైనికులు అమరులైతే, చైనా యాప్లపై నిషేధం విధించి చేతులు దులుపుకున్న మోదీ ధైర్యనిరతి యావత్తు ప్రజానీకానికి ఎట్టకేలకు తెలిసిపోయింది. అవును! తూర్పు లఢక్లోని పీపీ-16 మాత్రమే కాదు.. భారత్కు చెందిన నాలుగు కీలక ప్రాంతాలు చైనా ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ప్రపంచ వేదికపై మన అరుణాచల్ గడ్డ తమదిగా, కశ్మీర్ను పాకిస్థాన్ అంతర్భాగంగా చైనా గొప్పగా చెప్తుంటే మౌన ముద్రలో బొమ్మలా నిల్చోవటం మన ప్రధానికే చెల్లింది.
బఫర్ జోన్లుగా మార్చుకుంటూ..
2020 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు గల్వాన్, పాంగాంగ్ త్సో, గోగ్రా, హాట్స్ప్రింగ్స్ ప్రాంతాల నుంచి భారత్, చైనా బలగాలు వెనక్కి వెళ్లినట్టు రిటైర్డ్ కర్నల్, ప్రముఖ జర్నలిస్ట్ అజయ్ శుక్లా పేర్కొన్నారు. గతంలో ఈ నాలుగు ప్రాంతాలూ బఫర్ జోన్లుగా ఉండేవని, ఈ ప్రాంతాల్లో భారత ఆర్మీ గస్తీ నిర్వహించేదని ఆయన తెలిపారు. అయితే, ఇప్పుడు ఆ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించడానికి భారత ఆర్మీకి అధికారం లేదని, ఆ ప్రాంతాలపై మనం హక్కును కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ సర్కారు కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు. కాగా, తూర్పు లఢక్లోని పెట్రోలింగ్ పాయింట్ 15తో పాటు పెట్రోలింగ్ పాయింట్ 16 (పీపీ-16) నుంచి కూడా ఇరు దేశాల బలగాలు వెనక్కి తగ్గాయని లఢక్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్కు చెందిన కౌన్సిలర్ కొంచక్ స్టాంజిన్ ఇటీవల పేర్కొనడం తెలిసిందే. పీపీ-16 పూర్తిగా భారత్కు చెందినదేనని ఆయన పేర్కొన్నారు. చైనా ఆక్రమణలను చూస్తూ మౌనంగా ఉన్న మోదీపై నెటిజన్లు మండిపడుతున్నారు. 56 ఇంచుల ఛాతీ ఎక్కడికి పోయిందని ఎద్దేవా చేస్తున్నారు.
అరుణాచల్ చైనా వాళ్లదేనట!
ఉజ్బెకిస్థాన్లోని సమర్ఖండ్లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ క్రమంలో సభ్య దేశాలకు చైనా ఓ మ్యాప్ను ప్రదర్శించింది. అందులో అరుణాచల్ ప్రదేశ్, లఢక్ చైనాలో అంతర్భాగంగా కనిపించాయి. కశ్మీర్ పాకిస్థాన్లో భాగంగా ఉన్నది. ఈ మ్యాప్ చైనాకు చెందిన సీజీటీఎన్ చానల్లో కూడా రోజు మొత్తం టెలికాస్ట్ చేశారు. అయితే, ఈ మ్యాప్ను ఖండించకుండా.. మోదీ మౌనం వహించడం గమనార్హం.
పూర్తి నిజాలు చెప్పడం లేదు
చైనా-భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, బలగాల ఉపసంహరణపై మోదీ సర్కారు దేశ ప్రజలకు పూర్తి నిజాలను చెప్పడం లేదు. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బీజేపీ సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది.
– రిటైర్డ్ కర్నల్ అజయ్ శుక్లా