ప్రజలు, రాజకీయ నాయకులు, మేధావులు, ప్రజాస్వామ్య వాదులు తీవ్రంగా ఆలోచించాల్సిన సమయమిది. 8 ఏండ్లలో 8ప్రభుత్వాలను కూల్చేశారు. ఒక్క సీటు కూడా రాని రాష్ట్రంలో అధికార పార్టీని గంపగుత్తగా తమ పార్టీలో కలిపేసుకొని అధికారం గుంజుకుంటారు. మొన్న మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చేశారు. నిన్నటికి నిన్న తమిళనాడులో ప్రభుత్వాన్ని కూల్చేస్తామని అక్కడి బీజేపీ నేతలు ప్రేలాపనలు చేస్తారు. తెలంగాణలో ఏక్నాథ్ షిండేలు వస్తారని ఈ రాష్ట్ర నేతలా ప్రగల్భాలు పలుకుతుంటారు. ఇప్పుడు బెంగాల్లో అధికారపార్టీని చీలుస్తున్నామంటూ మిథున్ బరితెగించారు. ఇదేమి అరాచకం?
సరిగ్గా ఏడాది పూర్తయింది.. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి.. అప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఎంసీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదు. ఫిరాయింపులు.. కేసులు.. దాడులు.. సోదాలు.. అన్నింటినీ మించి శాంతి భద్రతల్లో కల్లోలం కూడా సృష్టించింది. స్కాంలు అంటూ టీఎంసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులపై కేసులు పెట్టి కాషాయం కప్పుకొనేలా ఒత్తిడి చేసింది. అయినా .. బెంగాల్ ప్రజలు మమతను మూడింట రెండు వంతుల మెజార్టీతో మూడో సారి గెలిపించారు. 294 స్థానాలున్న అసెంబ్లీలో ఏకంగా 215 స్థానాల్లో గెలిపించి అధికారం ఇచ్చారు. ఎన్ని కుయుక్తులు పన్నినా.. బీజేపీ 77 స్థానాలకే పరిమితమైంది.
అయినా.. మమత ప్రభుత్వాన్ని నిద్ర పోనియ్యకుండా దాడి చేస్తూనే ఉన్నది. ఇది చాలదన్నట్టు బుధవారం బీజేపీ నేత మిథున్ చక్రవర్తి బెంగాల్ ప్రభుత్వాన్ని కూలుస్తామని ప్రకటించారు. 38 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని.. వారిలో 21 మంది తనతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నారని కూడా మీడియా ముందు లెక్కలు కూడా చెప్పుకొచ్చారు.
మూడింట రెండు వంతుల భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని కూలిస్తే ఇక ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా? లేనట్టా? ఈ దేశంలో నడుస్తున్నది ప్రజాస్వామ్యమా? మోదీ స్వామ్యమా? ఈ దేశంలో ఎవరు పరిపాలించాలో నిర్ణయించాల్సింది ప్రజలా? బీజేపీయా?
ఎన్నికైన ప్రభుత్వం ఐదేండ్లు ఉండాలని రాజ్యాంగం చెప్తున్నది. తామెప్పుడైనా కూల్చేస్తామని బీజేపీ అంటున్నది. మరి ఎన్నికైన ప్రభుత్వం ఎన్నేండ్లు ఉండాలో నిర్ణయించాల్సింది రాజ్యాంగమా? మోదీ షా ద్వయమా?
మీకొక బ్రేకింగ్ న్యూస్ రాబోతున్నది. టీఎంసీలో 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారు. 21 మంది నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ఏం జరుగబోతుందో మీ ఊహకు వదిలేస్తున్నా. –మిథున్ చక్రవర్తి, బీజేపీ నేత
కోల్కతా, జూలై 27: ఒకవైపు దేశానికి కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్నది. అత్యున్నత శాసన వ్యవస్థ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. కేంద్రం అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ.. పార్లమెంట్ సమావేశాల్లో విపక్ష పార్టీల ఎంపీలు నిలదీస్తూ.. జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట 50 గంటల పాటు నిరవధిక నిరసన దీక్ష చేస్తున్న సమయంలో నిస్సిగ్గుగా బెంగాల్ బీజేపీ నేత.. పూర్తి మెజార్టీతో ఉన్న తృణమూల్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని వ్యాఖ్యలు చేయడంపై రాజకీయ పండితుల్లో తీవ్ర చర్చ సాగుతున్నది. ‘బీజేపీ నేతలకు పార్లమెంట్ అంటే భయం లేదు.. ఎన్నికల కమిషన్ అంటే గౌరవం లేదు.. న్యాయస్థానాలపై భయమూ, గౌరవమూ లేవు.. ఈ దేశం ఎటు పోతున్నది.. మనం ఏం చేస్తున్నాం?.. బీజేపీ అరాచక ధోరణులను ఇట్లా సహిస్తూ ఉండవలసిందేనా?’ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా దేశం మేలుకోవాలని పలువురు మేధావులు హితవు పలుకుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే తరహా రాజకీయం చేసిందని, అధికారం కోసం ఎమర్జెన్సీ తరహా అరాచకాన్ని సృష్టించిందని వారు గుర్తు చేస్తున్నారు. అదే పద్ధతిలో కాకపోయినా.. ఇప్పుడు దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని అంటున్నారు. అప్పుడు కాంగ్రెస్ దురాగతాలను ఎదుర్కోవడానికి లోక్నాయక్ జయప్రకాశ్నారాయణ్ లాంటి నేతలు వచ్చారని, ఇప్పుడు బీజేపీ అరాచకాన్ని అడ్డుకోవడానికి మరో జయప్రకాశ్నారాయణ్ రావాల్సిన అవసరం ఉన్నదని తేల్చి చెప్తున్నారు.
38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు టచ్లో
అధికార తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని బీజేపీ నేత మిథున్ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో 21 మంది ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా తనతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు. బుధవారం ఆయన కోల్కతాలో మీడియాతో మాట్లాడుతూ.. ‘మీకొక బ్రేకింగ్ న్యూస్ రాబోతున్నది. టీఎంసీలో 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారు. 21 మంది నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ఏం జరుగబోతుందో మీ ఊహకు వదిలేస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తృణమూల్ ఖండించింది. మిథున్ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, ఆయన దవాఖానకు వెళ్తే మంచిదని తృణమూల్ ఎంపీ శంతనుసేన్ ఎద్దేవా చేశారు. ‘మిథున్చక్రవర్తి దవాఖానలో చేరడం మంచిది. ఆయన మానసిక స్థితి బాగా లేదు. మెదడు సరైన స్థితిలో పని చేస్తున్న ఏ ఒక్కరూ ఈ రకంగా మాట్లాడరు. బీజేపీకి తన పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నది. ఇప్పటికే చాలామంది టీఎంసీలోకి వచ్చేశారు. మా తలుపులు తీసి ఉంటే ఇంకా చాలామంది టీఎంసీలో చేరుతారు’ అని శంతనుసేన్.. మిథున్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. మిథున్ చక్రవర్తి వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తాయి. మమతతో పెట్టుకోవద్దని హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి 47.93 శాతం ఓట్లు పోలయ్యాయి. 215 సీట్లు గెలుచుకొన్నది. బీజేపీ కనీసం తృణమూల్ దరిదాపుల్లో కూడా లేదు. 38.14శాతం ఓట్లతో 77 సీట్లు తెచ్చుకోవడమే గగనమైంది. ఈ ఏడాది కాలంలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు తృణమూల్లో చేరిపోయారు. మరికొందరు కూడా ఈ బాటలో వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ దశలో బెంగాల్లో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలన్న ఆతృతతో ఉన్న బీజేపీ నేతలు చిత్తం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.