న్యూఢిల్లీ: ఆధార్ అనేది 12 అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య. భారతీయులకు నివాస ధృవీకరణ, చిరునామా ధృవీకరణ పత్రంగా ఇది పనిచేస్తుంది. ఆధార్ కార్డులను జారీచేసే సంస్థ UIDAI 2022, నవంబర్ 30 నాటికి 135.10 కోట్ల మంది భారతీయులకు ఆధార్ నంబర్లను కేటాయించింది. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వం ఆధార్ కార్డుదారులందరికీ ఒక కొత్త విషయం తెలియజేసింది. ఇప్పటివరకు మంత్రులు, మంత్రిత్వ శాఖలు మాత్రమే నిర్వహించే ఆధార్ అథెంటికేషన్ పరిధిని ఇక నుంచి ప్రైవేట్ సంస్థలకూ విస్తరించాలని యోచిస్తోంది. ఈ మేరకు కొత్త రూల్స్తో ప్రతిపాదన తీసుకొచ్చింది.
ప్రస్తుతం ఆధార్ అథెంటికేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సోషల్ వెల్ఫేర్, ఇన్నోవేషన్, నాలెడ్జ్) రూల్స్ 2020 ప్రకారం.. వివిధ ప్రభుత్వ శాఖలు ఆధార్ అథెంటికేషన్ కోసం అనుమతి పొంది ఉన్నాయి. సుపరిపాలన, ప్రభుత్వ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడం, ఆవిష్కరణలను ప్రారంభించడం వంటి ప్రయోజనాల కోసం ఈ ఆధార్ అథెంటికేషన్ నిర్వహిస్తున్నారు.
ఆధార్ను పీపుల్ ఫ్రెండ్లీగా మార్చడానికి, పౌరుల జీవన సౌలభ్యం కోసం, మెరుగైన పౌర సేవల కొరకు ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు మాత్రమే కాకుండా ప్రైవేటు సంస్థల ద్వారా కూడా ఆధార్ అథెంటికేషన్ నిర్వహించాలని కేంద్రం కొత్త నియమాలను ప్రతిపాదించింది.