న్యూఢిల్లీ : 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ ఏడాది ఆగస్ట్ 15 నాటికి 75 వందేభారత్ ట్రైన్స్ను ప్రవేశపెడతామని మోదీ ప్రభుత్వం ఘనంగా చాటగా ఇప్పటివరకూ కేవలం ఏడు రైళ్లు మాత్రమే పట్టాలెక్కాయి. సికింద్రాబాద్-విజయవాడ మధ్య ఎనిమిదో వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈనెల 19న ప్రారంభం కానుంది. 2023 ఆగస్ట్ 15న ఆజాది కా అమృత్ మహోత్సవాలు ముగిసేందుకు ఇక తొమ్మిది నెలల సమయం మాత్రమే ఉండటంతో భారత రైల్వేల లక్ష్యం నెరవేరాలంటే ఇంకా 67 వందే భారత్ ఎక్స్ప్రెస్లను లాంఛ్ చేయాల్సి ఉంది.
ఆగస్ట్ 15 నాటికి ఈ లక్ష్యం నెరవేరాలంటే 204 రోజుల్లో 67 ఈ తరహా రైళ్లను నడపాల్సి ఉంది. అంటే ప్రతి 72 గంటలకు ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్కు ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించాల్సి ఉంటుంది. భారతీయ రైల్వేలకు ఇది అసాధ్యమైన ఫీట్. ఇక 2019 ఫిబ్రవరి 15న న్యూఢిల్లీ-వారణాసి మధ్య తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభమైంది. దీంతో ఎనిమిది ఈ తరహా సెమీ హైస్పీడ్ రైళ్లను నడిపేందుకు మూడేండ్ల సమయం పట్టింది.
ఇక దక్షిణాదిలో చెన్నై-మైసూర్ రూట్లో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇటీవల ప్రారంభమైంది. ఇక కొత్తగా ప్రతి వందే భారత్ ట్రైన్ కోసం న్యూ టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేపట్టాల్సి రావడంతో వ్యయం కూడా పెరుగుతోంది. 16 కోచ్ల వందే భారత్ ట్రైన్ నిర్మాణ వ్యయం రూ . 110 కోట్ల నుంచి రూ. 120 కోట్లకు ఎగబాకింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నిర్మాణం చేపట్టిన తొలినాళ్లలో వ్యయం రూ .106 కోట్లుగా ఉందని రైల్వేలు తెలిపాయి.