Petrol Price | బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లు దాటిందన్న నెపంతో పెట్రో ధరల్ని మోతమోగించిన మోదీ సర్కార్, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు 75 డాలర్లకు చేరుకున్నా.. ఆ మేరకు దేశీయంగా ధరల్ని తగ్గించటం లేదు. 14 నెలలుగా (ఏప్రిల్ 6, 2022 నుంచి) ఇంధన ధరల్ని మార్చటం లేదు. దీంతో అధిక ధరలు, ద్రవ్యోల్బణంతో సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. రష్యా నుంచి చవకగా ముడి చమురు కొన్నా..ఆ ప్రయోజనాన్ని దేశ ప్రజలకు బదిలీ చేయటం లేదు. మరోవైపు ప్రైవేటు కంపెనీలు రూపాయికి తక్కువకు పెట్రోలు, డీజిల్ విక్రయించాలని నిర్ణయించాయి.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గటంతో.. ఆ మేరకు వాహనదారులకు లబ్ధి చేకూర్చాలని ప్రైవేటు పెట్రో కంపెనీలు రిలయన్స్-బీపీ, నయారా ఎనెర్జీ నిర్ణయించాయి. ఆ మేరకు లీటరు పెట్రోలు, డీజిల్పై రూపాయి తగ్గించి విక్రయిస్తున్నాయి. జూన్ నెలాఖరు వరకు ఇది అమలులో ఉంటుందని ప్రకటించాయి. అంతర్జాతీయంగా చమురు ధర తగ్గినా.. ప్రభుత్వరంగ చమురు సంస్థలు (బీపీ, ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్) మాత్రం ఇంధన ధరల్ని తగ్గించటం లేదు. ఈ ప్రభావం ఇతర వినిమయ వస్తువులపై పడి.. అధిక ధరలు, ద్రవ్యోల్బణంతో సామాన్యులు సతమతమవుతున్నాయి.
ఇంధన ధరలపై అధిక పన్నులు వసూలు చేయడం కేంద్రం లబ్ధి పొందుతున్నదని విశ్లేషకులు చెప్తున్నారు. పెట్రోల్, డీజిల్పై ‘కృత్రిమ పెంపు’ కారణంగానే ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి చేరుకున్నదంటున్నారు. అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధర 100 డాలర్లకు చేరినప్పుడు దేశీయంగా పెట్రో ధరలు పెంచిన కేంద్రం అధిక పన్నులు, సెస్సుల రూపంలో లబ్ధి పొందుతున్నది.
అంతర్జాతీయంగా ధరలు తగ్గితే ఇక్కడా ధరల్ని తగ్గిస్తామన్న కేంద్రం ‘రోజు వారీ’ ధరల నిర్ణయ పద్ధతిని తీసుకొచ్చింది. అయితే 2014-21 మధ్య అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర 60 డాలర్లకు దిగి వచ్చినా.. కేంద్రం ఆ మేరకు ధరల్ని తగ్గించలేదు. రష్యా నుంచి చవగ్గా ముడి చమురు కొంటున్నా దేశ ప్రజలకు దక్కిన ప్రయోజనం ఏమీలేదు. మరోవైపు ప్రభుత్వరంగ చమురు సంస్థలు 2022 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య రూ.21,201కోట్ల నష్టాల్ని నమోదుచేయటం అంతుబట్టని విషయం.
భారత్ గత ఏడాదికాలంగా రష్యా నుంచి చవకగా ముడి చమురును కొంటున్న సంగతి తెలిసిందే. ఎంత తక్కువకు కొంటున్నారన్నది మాత్రం మోదీ సర్కార్ బయటపెట్టడం లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, బ్యారెల్ ముడిచమురును సుమారు 30 డాలర్లు (అంతర్జాతీయ మార్కెట్ ధరకన్నా) తగ్గించి కొంటున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి, 2022 నుంచి ముడిచమురు ధరలు క్రమంగా పడిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు బ్యారెల్ ముడిచమురు 75 డాలర్లకు చేరుకుంది. అయినా దేశీయంగా ఇంధన ధరలు మాత్రం తగ్గటం లేదు. భారీగా పన్నులు వసూళ్లు చేస్తూ ఖజానాను నింపుకోవాలన్న ఆరాటమే తప్ప, సామాన్యుడికి ఊరట కలిగించే ఉద్దేశం మోదీ సర్కార్లో కనపడటం లేదు.
– నేషనల్ డెస్క్