న్యూఢిల్లీ, మే 13: ‘ఒక వ్యక్తి మాటలు, చర్యలు హింసకు దారితీసినప్పుడు, హింసను ప్రేరేపించే ఉద్దేశంతోనే సదరు వ్యక్తి ఆ చర్యలకు పాల్పడ్డాడని భావించినప్పుడే ఆ వ్యక్తిపై రాజద్రోహం సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి’ అని కేదార్నాథ్ కేసులో సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. కానీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక.. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే రాజద్రోహం. బీజేపీ నాయకులను ప్రశ్నిస్తే రాజద్రోహం. బీజేపీకి నచ్చని ఏ పని చేసినా రాజద్రోహమే. తమకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దేశద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో వారిపై బీజేపీ రాజద్రోహ కేసులు పెట్టి వేధించింది. గడిచిన 12 ఏండ్లలో దేశంలో దాదాపు 11వేల మందిపై రాజద్రోహం కేసులు నమోదైతే వీటిలో 65% బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్టినవే.
మోదీని విమర్శించినందుకు 149 కేసులు
2014 నుంచి గమనిస్తే బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనే రాజద్రోహం కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. కేవలం రాజకీయ నాయకులను విమర్శించారన్న కారణంతో నాలుగు వందల మందిపై రాజద్రోహం కేసులు పెట్టారంటే ఈ సెక్షన్ను బీజేపీ ఎంతగా దుర్వినియోగం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఈ నాలుగు వందల కేసుల్లో 149 కేసులు ప్రధాని మోదీని విమర్శించినందుకు, 144 కేసులు యూపీ సీఎం యోగిని విమర్శించినందుకు పెట్టారు.
పాకిస్థాన్ పేరు చెప్పి కక్ష సాధింపు
పాకిస్థాన్కు అనుకూలంగా నినాదాలు చేశారని 2014 తర్వాత 44మందిపై రాజద్రోహం కేసులు నమోదు కాగా అందులో26 కేసులు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనివే. గడిచిన పదేండ్లలో యూపీలో 115 రాజద్రోహం కేసులు నమోదైతే అందులో 77% యోగి అధికారంలోకి వచ్చిన నాలుగేండ్లలో పెట్టినవే.
తెలియని వ్యక్తులపైనా కేసులు
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న 3,754 మందిపై రాజ ద్రోహం చట్టం కింద కేసులు పెట్టారు. వీరిలో కేవలం 96 మందినే గుర్తించారు. అంటే, మిగతావాళ్లు కనీసం ఎవరో కూడా తెలియకుండా వారిపై రాజద్రోహం కేసులు పెట్టారన్నమాట.