గోధుమల ఎగుమతి నిషేధంలో మోదీ సర్కార్ కుట్ర!
ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో గోధుమల రేట్లు పైపైకి
ఆ ప్రయోజనాలు రైతులకు దక్కనీయకుండా పన్నాగం
ఎంఎస్పీకే సేకరించి ఎక్కువ ధరకు విక్రయించే ప్లాన్
అందుకే ఆహార కొరత సాకుతో తెరపైకి కొత్త నాటకాలు
ఆసియా, ఆఫ్రికా, పశ్చిమ దేశాలతో ఇప్పటికే విక్రయ డీల్స్!
ప్రపంచానికి తిండి పెడుతాం.. మా దగ్గర ఆహార ధాన్యాల నిల్వలు నాలుగేండ్లకు సరిపడా ఉన్నాయ్.. అంటూ నిన్నటి వరకు గప్పాలు కొట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఉన్నట్టుండి తాజాగా ఆహార కొరత సాకుతో గోధుమల ఎగుమతులపై నిషేధం విధించింది. గోధుమలు బయటకు అమ్మేందుకు వీలు లేదంటూ ఆదేశాలు జారీచేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్లో ధాన్యం కొరత నిజంగా ఉన్నదా? లేక కృత్రిమ కొరత సృష్టించి, బయటి మార్కెట్లో గోధుమలకు ఉన్న డిమాండ్ ప్రయోజనాలు రైతులకు దక్కనీయకుండా కేంద్రం కుట్రకు పాల్పడుతున్నదా? ఆ సొమ్మును ఖజానాకు మళ్లించాలనుకొంటున్నదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచానికి తిండి పెట్టే స్థాయిలో నిల్వలు ఉన్నాయని ప్రకటించిన నెలకే ఆ నిల్వలు ఎలా తగ్గిపోయాయి? అనే ప్రశ్నలు మోదీ సర్కార్కు ఎదురౌతున్నాయి.
రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో గోధుమ పంట గణనీయంగా ఉంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా ఆయా దేశాల నుంచి ఎగుమతులు ఆగిపోవడంతో అంతర్జాతీయంగా ధరలు పెరిగాయి. గోధుమలకు డిమాండ్ పెరిగింది. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు కేంద్రం గోధుమల నిషేధంతో కుట్రలకు పాల్పడుతున్నదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. 2022-23 ఏడాదికి సంబంధించి క్వింటా గోధుమలకు కేంద్రం ఎంఎస్పీని రూ.2,015గా నిర్ణయించింది. అయితే మన దేశంలోనే మార్కెట్లో గోధుమలకు రూ.2,200 లభిస్తున్నది. విదేశాల్లో గోధుమలకు క్వింటాలుకు రూ. 3,409 పలుకుతున్నది.
ఎంఎస్పీ పెంపు మాత్రం ఉండదు
ప్రపంచ, బహిరంగ మార్కెట్ ధరలు, డిమాండ్కు అనుగుణంగానేమో కేంద్ర ప్రభుత్వం పంటను రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ఎంఎస్పీని పెంచదు. బయట మార్కెట్లో ఎక్కువ ధర వస్తుంది కదా! అక్కడ అమ్ముకుందాం అనుకునే రైతులకు నిషేధం పేరిట మోకాలడ్డుతున్నది. గోధుమల ఎగుమతులపై నిషేధం విధించడం ద్వారా వ్యాపారులు రైతుల వద్ద పంట ఉత్పత్తిని కొనుగోలు చేసేందుకు వెనక్కు తగ్గుతారు. ఇటువంటి సమయంలో రైతులేమో తమ పంటను ఎక్కువ కాలం తమవద్దనే ఉంచుకోలేరు. పెట్టిన పెట్టుబడులు, చేసిన అప్పులను తీర్చుకోవాలంటే పంటను అందినకాడిని అమ్ముకోవాల్సిన పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం సృష్టించి వారిని త్రిశంకు స్వర్గంలోకి నెట్టుతున్నది. ఇటువంటి సమయంలో రైతులు పంటను తప్పక ప్రభుత్వానికే అమ్మేవిధంగా తాజా నిర్ణయం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆహార సంక్షోభం ఉందంటూ మభ్యపెట్టి తాము నిర్ణయించిన తక్కువ ఎంఎస్పీకే రైతుల నుంచి గోధుమలు సేకరించి.. ఆసియా, ఆఫ్రికా, పశ్చిమ దేశాలకు ఎక్కువ ధరలకు విక్రయించాలని కేంద్రం భావిస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకుగానూ, గతంలో చేసుకొన్న ఒప్పందాలను ఒక సాకుగా చూపించవచ్చని చెబుతున్నారు.
రైతులపై పరోక్ష పన్ను
గోధుమ ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించడం విచారకరం. అంతర్జాతీయ మార్కెట్లలో గోధుమలకు డిమాండ్ ఉన్న ఈ సమయంలో ధాన్యం ఎగుమతులపై ఆంక్షలు విధించడం రైతులకు నష్టాన్ని కలిగిస్తుంది. ఇది అన్నదాతలపై పరోక్ష పన్ను విధించడమే. అందుకే మార్కెట్ సంస్కరణలను అన్నదాతలు విశ్వసించడం లేదు. -భారత్ కృషక్ సమాజ్ ఛైర్మన్ ఆజయ్ వీర్ జఖర్
గోల్మాల్ కేంద్రం ప్రకటనలివి..