న్యూఢిల్లీ, జూన్ 14: దేశంలో నిరుద్యోగిత 40 ఏండ్లలో ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయికి పెరిగిపోవటం, ఉపాధి లేక యువతలో ఆగ్రహావేశాలు పెల్లుబికుతుండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎట్టకేలకు ఉద్యోగాల భర్తీ ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో వచ్చే ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు. ప్రధాని మోదీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టు ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఏయే విభాగాల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు. కాగా, కేంద్రంలో ఇప్పటికే 60 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని లెక్కలు చెప్తున్నాయి. ఇప్పుడు 10 లక్షల ఉద్యోగాల భర్తీ అని షా చేసిన ప్రకటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. షా ప్రకటనపై బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ సెటైర్ వేశారు. పోస్టుల భర్తీపై ప్రధానికి ధన్యవాదాలు చెప్తూనే, ఖాళీగా ఉన్న కోటి ఉద్యోగాలు భర్తీకి అర్థవంతమైన ప్రయత్నం జరగాలని పేర్కొన్నారు.
కోట్ల ఉద్యోగాలేవి?
10 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రకటనపై దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణు లు తెగ డబ్బా కొట్టుకొంటున్నాయి. 2014 లోక్సభ ఎన్నికల సమయంలో నాటి బీజేపీ ప్ర ధాని అభ్యర్థి నరేంద్రమోదీ తాము అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామని ఎన్నికల సభలలో వాగ్దానం చేశారు. ఈ 8 ఏండ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చారని ప్రతిపక్షాలు ఎన్నిసార్లు నిలదీసినా పకోడాలు, బజ్జీల కథే చెప్తున్నారు తప్ప ఉద్యోగాల లెక్క చెప్పలేదు.
తెలంగాణ కంటే ఎంతో వెనుకబాటు
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కేంద్రం కంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందున్నది. గత 8 ఏండ్లలో రాష్ట్రప్రభుత్వం ఏకంగా 2,30,365 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. ఇప్పటికే 1,26,644 ఉద్యోగాలు భర్తీ చేసింది. 23,685 ఉద్యోగాల భర్తీ వివిధ దశల్లో ఉన్నది. తాజాగా గ్రూప్-1 నోటిఫికేషన్ ద్వారా 503 పోస్టులు, పోలీస్ విభాగాల్లో 17,291 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. కేంద్ర శాఖల్లో మాత్రం ఖాళీల భర్తీని బీజేపీ సర్కారు మూలన పెట్టింది. 2014 నుంచి 6.9 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేసినట్టు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ గతంలో పార్లమెంటులో ప్రకటించారు. కానీ ఏ శాఖలో ఎన్ని పోస్టులు, ఎప్పుడు భర్తీచేశారన్నదానిపై స్పష్టత లేదు. తాజా లెక్కల ప్రకారం వివిధ శాఖలు, విభాగాల్లో 60 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
నూటికి 26 మందికి ఉద్యోగం లేదు
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో నిరుద్యోగిత పెరగటం మొదలైంది. 2020లో కరోనా విజృంభణతో అది తారా స్థాయికి చేరింది. 2020లో దేశంలోని యువతలో నూటికి 38.9 మంది ఉపాధి లేక విలవిల్లాడిపోయారు. 2021లో నూటికి 26 మంది నిరుద్యోగులే. 2022 మొదటి త్రైమాసికంలో నిరుద్యోగిత 22 శాతానికి తగ్గిందని కేంద్రం చెప్తున్నది.
జిమ్మిక్కులు ఆపండి
అమిత్ షా ప్రకటనపై కాంగ్రెస్ మండిపడింది. ఇప్పటికే 60 లక్షల ఖాళీలున్నాయని, ఇప్పుడు 10 లక్షలు భర్తీ చేస్తామంటూ ఎవరిని మోసం చేస్తారని పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. జిమ్మిక్కులు ఆపాలని చురకలంటించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగావకాశాలు కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ 8 ఏండ్లలో భర్తీ చేయాల్సిన 16 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు.
పకోడీలమ్మినా ఉద్యోగమే
ఏటా కోట్ల ఉద్యోగాలిస్తానని వాగ్దానం చేసి ప్రధాని పీఠం ఎక్కిన నరేంద్రమోదీ, ఆ తర్వాత నాలుక మడతేశారు. తాను చాయ్వాలానంటూ తరుచూ చెప్పుకొనే ఆయన..2018 ఫిబ్రవరి 5న ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఓ వ్యక్తి పకోడీలు అమ్ముకొని రోజుకు రూ.200 సంపాదిస్తున్నాడని అనుకొందాం. అది ఆయన ఉద్యోగంగా పరిగణించకూడదా?’ అని ప్రశ్నించారు.
తెలంగాణకేదీ అభినందన?
1,32,899 ఉద్యోగాలు భర్తీ చేసినా స్పందన లేదు
మోదీ 10 లక్షల ఉద్యోగాలు అనగానే స్పందించిన గవర్నర్
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): గవర్నర్ తమిళిసై మరోసారి పక్షపాత ధోరణి అవలంబించారు. కొత్తగా పురుడుపోసుకున్న, చిన్న రాష్ట్రమైన తెలంగాణలో కేసీఆర్ 1,32,899 ఉద్యోగాలు భర్తీ చేసినా స్పందించలేదు. అసెంబ్లీ సాక్షిగా 91,142 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు కేసీఆర్ చారిత్రాత్మక ప్రకటన చేశారు. 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తున్నట్టు ప్రకటించారు. 80,039 పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఆదేశించారు. ఇప్పటికే పోలీస్, గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చేశారు. అయినప్పటికీ.. గవర్నర్ హర్షం వ్యక్తం చేయలేదు. ఎన్నడూ లేనంతగా ఉద్యోగాల వయోపరిమితిని గరిష్ఠంగా పదేండ్లు పెంచినా కనీసం స్పందించ లేదు. కానీ.. మోదీ దేశవ్యాప్తంగా ఒకటిన్నరేండ్లో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు ప్రకటించగానే.. తనదైన శైలిలో స్పందించారు. ఆ ట్వీట్ను రీట్వీట్ చేశారు.