Demonetisation ‘మై సిర్ఫ్ పచాస్ దిన్ మాంగ్ రహా హూ.. డిసెంబర్ 30 తక్ ముఝే మౌకా దీజియే.. అగర్ డిసెంబర్ 30 కే బాద్, కోయీ మేరీ కమీ రెహ్జాయే, కోయీ మేరీ గల్తీ నికల్ జాయే, కోయీ మేరీ గలత్ ఇరాదా నికల్ జాయే, ఆప్ జిస్ చౌరాహే పర్ ముఝే ఖడా కరేంగే, మై ఖడా హో కర్ దేశ్ జో సఝా దేగా, వో సఝా భుగత్నే కే లియే తయ్యార్ హూ..’ (నాకు 50 రోజుల సమయమివ్వండి. పెద్ద నోట్ల రద్దులో నా తప్పు ఉన్నట్టు తేలితే, మీరు ఏ చౌరస్తాకి పిలిచినా వస్తా. దేశం విధించిన శిక్ష భరిస్తా..)
– 2016, నవంబర్ 14న ప్రధాని మోదీ వ్యాఖ్యలివి.
దేశంలోని 19,86,72,621 చౌరస్తాలు (కూడళ్లు) ఇప్పుడు నరేంద్ర మోదీ కోసం ఎదురుచూస్తున్నాయి. ఎందుకో తెలుసా? 2016 నవంబర్ 8న ముందూ వెనుక ఆలోచించకుండా పెద్ద నోట్లను రద్దు చేస్తూ మోదీ తీసుకొన్న ఏకపక్ష నిర్ణయం అతిపెద్ద వైఫల్యమని తేలడమే. ఈ విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే అంగీకరించింది.
స్పెషల్ టాస్క్ బ్యూరో, హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ ఆరున్నరేండ్ల కిందట తీసుకొన్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అతిపెద్ద వైఫల్యమని వెల్లడైంది. నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడానికి, దొంగనోట్లు ముద్రణను అడ్డుకోవడానికి, ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అరికట్టడానికి ఈ నిర్ణయం ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయిందని తేలిపోయింది. ఈ మేరకు సోమవారం పార్లమెంట్లో కేంద్రప్రభుత్వం ఇచ్చిన గణాంకాలను బట్టి తెలుస్తున్నది. మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టడానికి ముందు అంటే 2014 మార్చి నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో రూ.13 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉండగా.. 2022 మార్చి నాటికి ఈ మొత్తం రూ.31.33 లక్షల కోట్లకు చేరింది. 2014లో జీడీపీలో 11.6 శాతంగా ఉన్న నగదు విలువ.. 2022 మార్చి 25 నాటికి 13.7 శాతానికి పెరిగింది. ఈ మేరకు సభ్యుడు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభకు వెల్లడించారు.
నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. అలాంటప్పుడు, నోట్ల వాడకం తగ్గాలి. అయితే, నోట్ల రద్దు నిర్ణయం తీసుకొన్న 2016 నుంచి ఇప్పటివరకూ నోట్ల వాడకం దాదాపుగా రెట్టింపు కావడం గమనార్హం. ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం.. 2016లో రూ.16.41 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉండగా, 2022 డిసెంబర్ 23 నాటికి ఇది 32.42 లక్షల కోట్లకు చేరింది. దాదాపుగా రెట్టింపైంది. ప్రజల వద్ద ఉన్న నోట్ల సంఖ్య కూడా 30% పెరిగినట్టు గత డిసెంబర్లో నిర్మల పార్లమెంట్లో వెల్లడించారు.
నోట్ల రద్దు నిర్ణయం కారణంగా దేశవ్యాప్తంగా 62 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వేలాది కంపెనీలు మూతబడ్డాయి. నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలైన్లలో నిలబడి 108 మంది మృత్యువాతపడ్డారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటే సర్కారీ దవాఖానల్లో ఇచ్చే రూ.2 వేల కోసం దాదాపు 265 మంది ఈ ఆపరేషన్లు చేయించుకొన్నారు.
పెద్దనోట్ల రద్దు నిరంకుశ చర్య. ఈ నిర్ణయంతో ఫలితం తక్కువ.. ఇబ్బందులు ఎక్కువ. ఒక్కమాటలో చెప్పాలంటే, నోట్ల రద్దు నిర్ణయం భారత్ వంటి ఓ విశ్వసనీయ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది.
– ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత, భారతరత్న అమర్త్యసేన్
పెద్ద నోట్ల రద్దు ఓ విఫల ప్రయత్నమని, ఈ నిర్ణయం వద్దని ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించా. నల్లధనం వెలికితీతకు నోట్ల రద్దు కంటే ఉత్తమమైన ప్రత్యామ్నాయాలను సూచించా. అయితే, వాటిని పట్టించుకోలేదు.
– ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
నోట్ల రద్దు ఓ పెద్ద వైఫల్యం. నల్లధనానికి, దానికి అసలు సంబంధమే లేదు. ఈ నిర్ణయంతో ప్రభుత్వం గొప్పగా సాధించిందేమీ లేదు.
– ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి
పెద్ద నోట్ల రద్దు చట్టవిరుద్ధమైన చర్య. ప్రజాప్రతినిధులు ఉన్న పార్లమెంట్లో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అలా జరుగలేదు. ఒకేసారి అన్ని సిరీస్ల నోట్లను రద్దు చేయడం ఎంతో తీవ్రమైన అంశం. దేశ ఆర్థిక వ్యవస్థపైనే గాకుండా ప్రతీ సామాన్య పౌరుడిపై ఈ నిర్ణయం ఎంతో దుష్ప్రభావాన్ని చూపించింది.
– సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బీవీ నాగరత్న
నోట్ల రద్దు ప్రకటన తర్వాతి వారంలోనే మా షాప్ గిరాకీ 50% తగ్గిపోయింది. కస్టమర్ల నుంచి పాత నోట్లు తీసుకొందామంటే, బ్యాంక్ వాళ్లు తీసుకొంటారో, లేదోనని భయం.
– మంజునాథ, వ్యాపారి, చిత్తూరు
నోట్ల రద్దు ప్రకటన సమయంలో విహారయాత్రలో ఉన్నాం. మా దగ్గరున్న డబ్బును ఏ హోటల్ వాళ్లూ తీసుకోలేదు. పిల్లలేమో ఆకలి అంటూ ఏడుపు. ఇక, షాప్ వాళ్లను బతిమాలి.. డబుల్ రేటు చెల్లించి పాలు, బ్రెడ్డు కొనుక్కొన్నాం.
– ఎస్ హేమంత్ కుమార్, రిటైర్డ్ ఉద్యోగి, బెంగళూరు