ఈ ఏడాదే యోగి ముక్త్ యూపీ
బీజేపీ మాజీ నేత సుధీంద్ర కులకర్ణి
లక్నో: వాజపేయి-అద్వానీ నేతృత్వంలోని బీజేపీకి, మోదీ-అమిత్షా బీజేపీకి మధ్య భూమ్యాకాశాల మధ్య ఉన్నంత తేడా ఉందనివాజపేయి దీర్ఘకాలిక సహచరుడైన బీజేపీ మాజీ నేత సుధీంద్ర కులకర్ణి అభిప్రాయపడ్డారు. విద్వేషం రెచ్చగొట్టి, భయాందోళనలు వ్యాపింపజేసి వాజపేయి ఎప్పుడూ రాజకీయ లబ్ధి పొందాలని చూడలేదని అన్నారు. కానీ గత ఎనిమిది సంవత్సరాలుగా దేశంలో అదే జరుగుతున్నదని దుయ్యబట్టారు. ఈ భయం నుంచి, ప్రజాస్వామిక వ్యవస్థలను రోజు విడచి రోజు జరుగుతున్న దాడుల నుంచి కాపాడేందుకు, దేశంలోని వైవిధ్యాన్ని కాపాడే ఐక్యత సాధించేందుకు 2024లో ‘మోదీముక్త్ భారత్’ను సాధించడం చాలా అవసరమని, అంతకంటే ముందు 2022లో ‘యోగి ముక్త్ యూపీ’ సాధించడం ముఖ్యమని కులకర్ణీ అన్నారు. కాంగ్రెస్ లేదా సమాజ్వాదీ పార్టీ.. బీజేపీని ఓడించే పార్టీ ఏదైనా తన సహకారం అందిస్తానని అన్నారు. గత 70 ఏండ్ల పాలనలో దేశంలో ఏమీ జరగలేదని మోదీ అనుచరగణం చేస్తున్న ప్రచారంలో పస లేదని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం 2014లో వచ్చిందా? అని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. మోదీ అంధ భక్తులు తప్ప ఆలోచించగలిగే భారతీయులెవ్వరూ దీనిని నమ్మరని అన్నారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మోదీ సభలో ఖాళీ కుర్చీలు
ప్రధాని మోదీ గురువారం యూపీలోని అమేఠీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో వరుసలకు వరుసలు కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. హాజరైన వారు కూడా మోదీ ప్రసంగం వినకుండా.. కొంతమంది కుర్చీల్లోనే నిద్రపోవడం, ఫోన్లలో మాట్లాడుకోవడం వంటివి చేశారు. సభకు జనాలు పోటెత్తుతారనే ఆశతో బీజేపీ నేతలు వేలాది కుర్చీలు వేయగా, తీరా ‘ఖాళీ కుర్చీ’ల సీన్ చూసి షాక్కు గురయ్యారు.