Chidambaram | గోవా విముక్తి కోసం మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సరైన టైంలోనే జోక్యం చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ నేత పీ చిదంబరం స్పష్టం చేశారు. నెహ్రూ వల్లే గోవా విముక్తి ఆలస్యమైందన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలను ఖండించారు. చరిత్రను వక్రీకరించేందుకు చేసే ప్రయత్నమే ఈ వ్యాఖ్యలని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలకు స్వాతంత్య్ర అనంతర చరిత్ర తెలియదన్నారు.
ముఖ్యంగా 1947-60 మధ్య అంశాలపై మోదీ, అమిత్షాలకు అవగాహన లేదని చిదంబరం అన్నారు. దేశాన్ని పండిట్ నెహ్రూ ఎంత నేర్పుగా నడిపారో వారికి తెలిసుండదన్నారు. నెహ్రూ హయాంలో శాంతి కాముక దేశంగా, అలీనోద్యమ కూటమి సారధిగా భారత్ పేరొందిందని గుర్తు చేశారు. గోవా విముక్తి కోసం నెహ్రూ సరైన సమయంలో జోక్యం చేసుకున్నారని, దుకే మిలిటరీ చర్యకు వ్యతిరేకంగా ఒక్క గొంతుకూడా వినిపించలేదని చిదంబరం చెప్పారు.
గోవా ప్రజలు తమ భవిష్యత్ను నిర్ణయించుకోవడానికి ఒపీనియన్ పోల్ నిర్వహించడం వల్లే ఈనాడు అది ఒక స్వతంత్ర రాష్ట్రంగా ఉందని చిదంబరం గుర్తు చేశారు. మోదీ, అమిత్షాలు ఏం చెప్పినా.. నెహ్రూ వ్యవహార శైలిని గోవా ప్రజలు గుర్తు పెట్టుకుంటారని అన్నారు. గురువారం ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నెహ్రూ తలుచుకుంటే కొన్ని గంటల్లోనే గోవా స్వేచ్ఛాయుత ప్రాంతంగా ఉండేదన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 15 ఏండ్లకు పోర్చుగీస్ వలస పాలన నుంచి గోవా బయటపడిందన్నారు.